మామడ, ఏప్రిల్29 : మండలంలోని పొన్కల్లో ట్రాక్టర్ డ్రైవర్ తాటికొండ వినోద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. మామడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. 2021లో బండల్ ఖానాపూర్కు చెందిన బదావత్ మధు పొన్కల్ శివారులోని పొదల్లో పడి మృతి చెందాడు. అతని మృతికి తాటికొండ వినోద్, అతని తల్లి కారణమని మధు కుటుంబ సభ్యులు అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో వినోద్ను హతమార్చాలని బదావత్ రాజు అతని తండ్రి జైసింగ్, అన్న కిశోర్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 25న వినోద్ రాత్రి సమయంలో పొన్కల్ గ్రామంలో ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. గమనించిన కిశోర్.. వినోద్ను మద్యం తాగుదామని పొన్కల్ శివారుకు తీసుకెళ్లాడు. మార్గమద్యంలో కిశోర్ బంధువైన రాజు వీరికి కలిశాడు.అతన్ని కూడా తీసుకెళ్లాడు. మద్యం తాగిన అనంతరం పథకం ప్రకారం రాజు తన వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహన క్లచ్ వైరుతో ఉరివేసి చంపేందుకు యత్నించగా వినోద్ ప్రతిఘటించాడు.
దీంతో రాజు కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడిక్కడే చనిపోయాడు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి నిందితులు రాజు, కిశోర్ పరారయ్యారు. జరిగిన విషయాన్ని తండ్రి జైసింగ్కు తెలిపారు. రక్తపు మరకల బట్టలను పాడుబడిన బావిలో పడేశారు. గురువారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోన్ సీఐ నవీన్కుమార్,ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి కత్తి, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.