విపత్కర పరిస్థితుల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్.. కుయ్ అని మన ఎదుట నిలిచే వాహనం 108. రోడ్డు ప్రమాదమైనా, ప్రసవ సేవలైనా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా, గుండెపోటుకు గురైనా బాధితుడిని దవాఖానకు చేర్చడానికి ముందు గుర్తొచ్చే వారు అంబులెన్స్ సిబ్బంది. విమానాలు నడిపేవారిని పైలెట్ అని పిలుస్తుండగా.. మన దేశంలో అంబులెన్స్ నడిపే డ్రైవర్స్ను కూడా పైలెట్గా పిలుస్తూ గౌరవించుకుంటున్నాం. ఇటువంటి సిబ్బంది సేవలకు మారుపేరుగా నిలుస్తున్నారు. గురువారం వారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చిన్నుగూడలో గిరిజన గర్భిణీకి డెలివరీ చేసి ప్రాణం కాపాడారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి వాగు దాటి పురుడు పోశారు.
– ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 21
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 21 : వర్షంలోనూ పురుడుపోసి 108 సిబ్బంది శభాష్ అనిపించుకున్నారు. మండలంలోని చిన్నుగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108కు ఫోన్ చేశారు. వెంటనే సిబ్బంది చిన్నుగూడ గ్రామానికి బయల్దేరారు. వర్షం కురుస్తుండడంతో చిన్నుగూడకు పోయే దారిలో భీంగూడ వద్ద వాగు నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చింది. దీంతో 108 సిబ్బంది తమ వాహనాన్ని భీంగూడ వద్ద ఉంచి నడుచుకుంటూ చిన్నుగూడకు వెళ్లి గర్భిణి భీంబాయిని తీసుకొని వస్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
గ్రామం నుంచి గొడుగులు తెప్పించి అన్నీ తామై వర్షంలోనే పురుడుపోశారు. భీంబాయికి మొదటి కాన్పు కావడంతో ఎలా జరుగుతుందో అని కుటుంబ సభ్యులు బెంగపెట్టుకున్నారు. నార్మల్ డెలివరీ అయిన భీంబాయి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు 108 సిబ్బందిని అభినందించారు. అనంతరం ఈఎంటీ శంకర్, పైలెట్ సచిన్ బాలింత భీంబాయి, శిశువుని వాగు దాటించి 108లో ఉట్నూర్ సీహెచ్సీకి తరలించారు.