జైనూర్, జనవరి 11: బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసుల జీవితాల్లో వెలుగు నింపిన పుణ్య దంపతులు ప్రొఫెసర్ హైమన్డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 36వ వర్ధంతిని మండలంలోని మార్లవాయిలో ఘనంగా నిర్వహించారు. వారి విగ్రహాల వద్ద ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా ఆదివాసులు, నాయకులు, అధికారులు నివాళులర్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనప్ప, ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ రాహుల్రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఎస్పీ సురేశ్కుమార్, మాజీ ఎంపీ గోడాం నగేశ్తో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా గ్రామ పటేల్ ఇంటివద్ద నుంచి ర్యాలీగా ఆదివాసీ సాంప్రదాయబద్ధమైన వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో డార్ఫ్ దంపతుల సమాధుల వద్దకు చేరుకున్నారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హన్ను మాస్టర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వం పద్మశ్రీ కనక రాజుకు మంజూరు చేసిన డబుల్బెడ్రూం ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ప్రొఫెసర్ హైమన్డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, అధికారులు మాట్లాడారు. ఆదివాసులు విద్యావంతులైతేనే అన్ని రంగాల్లో రాణించి, ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని సూచించారు. ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
గిరి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు : ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి
గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద మార్లవాయి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు గిరిజన అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మార్లవాయిలో గుస్సాడి శిక్షణ కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేసి శిక్షణ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జీవో 3పై కేంద్ర ం వైఖరి సరికాదు : మాజీ ఎంపీ గోడాం నగేశ్
జీవో 3 రద్దు విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదని, కావాలనే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎంపీ గోడాం నగేశ్ అన్నారు. ఆదివాసులు విద్యావంతులవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రా ష్ట్ర సర్కారు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదని వీటిని సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
దైవాలుగా భావించడం ఆదివాసుల గొప్పతనం : ఎస్పీ సురేశ్కుమార్
డార్ఫ్ దంపతుల కృషిని నేటికి మరువక వారినీ దైవాలుగా భావించడం ఆదివాసుల గొప్పతనమని జిల్లా పోలీసు శాఖ ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసులు మీకోసం’లో భాగంగా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా గిరిజన యువకులకు అన్ని రం గాల్లో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
డార్ఫ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి : అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
ఆదివాసుల జీవితాలు బాగుపడాలని ప్రొఫెసర్ హైమన్డార్ఫ్ దంపతులు ఆశించారని, వారి ఆశయాల సాధనకు ఆదివాసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసుల అభ్యున్నతికి అధికా ర యంత్రాంగం కృషిచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కనక రాజు, రాష్ట్ర మహి ళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కెరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, నాయకులు కనక వెంకటేశ్వర్రావు, అంబాజీరావు, ఆత్రం శంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.