ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాదాపు నిరుపేదలే ఉంటారు. వీరు ఉదయం బడికి వచ్చేటప్పుడు ఏమి తినకుండా వస్తుండగా.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇందు కోసం రాష్ట్ర సర్కారు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’కు శ్రీకారం చుట్టింది. నేడు (శుక్రవారం) ప్రారంభించనుండగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. నిర్మల్ జిల్లాలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించనున్నారు. ఫలితంగా ఆదిలాబాద్లో 1,422 బడుల్లోని 1,31,580 మందికి, నిర్మల్ జిల్లాలోని 50709 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. నేటి నుంచి ఐదు రోజులు ట్రయల్.. ఈనెల 24 నుంచి యథావిధిగా కొనసాగనుంది.
– ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ అర్బన్, అక్టోబర్ 5
ఆదిలాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరుస్తుండటంతో సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పట్టణాలతో పాటు గ్రామాల్లోని వివిధ శాఖల పరిధిలో స్కూళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, ఉపాధ్యాయుల నియామకం, పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. సర్కారు అందిస్తున్న సాయంతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యనందిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల పర్యవేక్షణకు కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
అధికారులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు మెరుగైన వి ద్యనందించేలా అవసరమైన సౌకర్యాలు కల్పిసుస్తన్నది. జిల్లాలో మనఊరు, మనబడి పథకంలో భాగంగా మొదటి విడుతలో 236 పాఠశాలలను ఎంపిక చేసి కొత్త గదుల నిర్మాణంతో పాటు విద్యుత్, తాగునీటి సౌకర్యం, వంటగదులు, భోజనశాలలు, ప్రహరీలు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ లాంటి సౌకర్యాలను కల్పించారు. ఇప్పుడు అల్పాహార పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో రవ్వ ఉప్మా, పొంగల్, కేసరి, కిచిడితో పాటు ఇతర ఆహార పదార్థాలు ఉంటాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ..
ఆదిలాబాద్ జిల్లాలో 675 పాఠశాలల్లో 46851 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా ప్రభు త్వ పాఠశాలల్లో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్ హాజరుకానున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 5: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా అల్పాహారం అందించనున్నారు. ఈపథకాన్ని నిర్మల్ జిల్లాలో రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం నుంచి ప్రాంభించి, ఐదు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. సెలవుల అనతంరం ఈనెల 24వ తేదీ నుంచి నిరంతరంగా విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. సోన్ మండల ప్రాథమిక పాఠశాలలో అల్పాహార పథకాన్ని నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డితో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రారంభించనున్నారు. ఇందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఎంపీపీఎస్ సుర్జాపూర్ హెచ్డబ్ల్యూ పాఠశాలలో ఖానాపూర్ ఎమెల్యే రేఖా నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పథకాన్ని ప్రారంభించనున్నారు. ముథోల్ నియోజకవర్గంలో దేగాంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అల్పాహారాన్ని ప్రారంభించనున్నారు. కాగా, ‘ముఖ్యమంత్రి అల్పాహారం పథకం’ ద్వారా జిల్లాలో 50,709 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందనుంది.
నేడు అల్పాహార పథకం ప్రారంభం
సోన్, అక్టోబర్ 5: సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అమలు చేయనున్న అల్ఫాహార పథకం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభిస్తారని పీఏసీఎస్ ఛైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మోహినొద్దీన్ తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. కలెక్టర్ వరుణ్రెడ్డి, అధికారులు హాజరవుతారని తెలిపారు.