సోన్, జనవరి 17 : భైంసా- నిర్మల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్వర్ణవాగులో చిట్యాల్ చెక్డ్యాం నుంచి ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 15న ప్రచురితమైన ‘హైటెక్ ఇసుక దోపిడీ’ కథనానికి అధికారులు స్పందించారు. మనుషుల ప్రాణాల కన్న ఇసుక వ్యాపారమే మిన్న అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’ మానవీయ కోణంలో ఈ వార్తను ప్రచురించింది. చిట్యాల్ వాగు నీటిలో నుంచి ఇసుకను తీస్తుండగా నిర్మల్ రూరల్ తహసీల్దార్ ప్రభాకర్తో పాటు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
మంజులాపూర్ శివారులో ఇసుక డంపు చేస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు తెప్పలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇసుక నిల్వలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. స్వర్ణవాగు పరీవాహక ప్రాంతాలైన వెంగ్వాపేట్, తల్వేద, చిట్యాల్, కౌట్ల, తాంశ, సిద్ధాపూర్ వాగు నుంచి ఇసుక తరలిపోకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు వివరించారు.