బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప్పున రూ.3.12 లక్షలు కేటాయించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 1360 మందికి ప్రయోజనం చేకూరనుంది. రెండు, మూడు రోజుల్లో కలెక్టర్తో చర్చించిన అనంతరం టెండర్ నిర్వహించి ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విద్యార్థినికీ ఇప్పటికే నెలకు రూ.100 చొప్పున ఖర్చవుతుండగా.. ఈ ఖర్చు కూడా లేకుండా ఉచితంగా సర్కారు అందించడంపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ టౌన్, నవంబర్ 7 : బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుకుంటున్న ప్రీ, పోస్టు మెట్రిక్ విద్యార్థినుల ప్రయోజనార్థం సర్కారు మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతి బాలికల హాస్టల్లో న్యాప్కిన్స్ త యారు చేయడానికి యంత్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు ఒక్కో హాస్టల్కు రూ. 26 వేల చొప్పున నిధులు కేటాయిస్తూ బీసీ సంక్షే మ శాఖ ముఖ్యకార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక వెనుకబడిన విద్యార్థుల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం, ఇతరాత్ర సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రస్తుతం బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాప్కిన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది పోస్టుమెట్రిక్, తొమ్మిది ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉండగా.. సుమారు 1,320 మంది విద్యార్థులు విద్యా బోధన చేస్తున్నారు. వీరందరికీ నెలసరిలో భాగంగా వినియోగించే న్యా ప్కిన్స్ సొంత ఖర్చులతోనే భరిస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి నెలకు రూ.100 చొప్పున ఖర్చు అవుతున్నట్లు సర్కారు గుర్తించింది. ఈ మేరకు స్థానికంగా తయారు చేసి ప్రతినెలా ఉచితంగా నాలుగు కిట్లను అందించాలని నిర్ణయించింది.
ఉమ్మడి జిల్లాకు రూ. 3.12 లక్షల బడ్జెట్ విడుదల
న్యాప్కిన్స్ యంత్రాల కోసం సర్కారు ఉమ్మడి జిల్లాకు రూ.3.12 లక్షలు కేటాయించింది. నిర్మల్ జిల్లాలో పోస్టుమెట్రిక్ 3, ప్రీ మెట్రిక్ 2 హాస్టళ్లుండగా.. 420 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదిలాబాద్లో 3 పోస్టు మెట్రిక్, ఒక ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉండగా 360 మంది.. మంచిర్యాలలో రెండు పోస్టు, రెండు ప్రీ మెట్రిక్ హాస్టళ్లుండగా 320, ఆసిఫాబాద్లో ఒక పోస్టు మెట్రిక్, నాలుగు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉండగా 220 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ కూడా ప్రయోజనం చేకూర్చనున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారుల ఖాతాలో నిధులు జమ కావడంతో రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ సమక్షంలో చర్చించి టెండరు ద్వారా న్యాప్కిన్ మిషన్లను అన్ని హాస్టళ్లలో ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు పేదవారు కావడంతో ప్రభుత్వమే ఉచితంగా అందించనుండంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఆమోదంతో పనులు
బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉం టున్న విద్యార్థినుల ప్రయోజనం కోసం ప్రభుత్వం న్యాప్కిన్ మిష న్లను ఏర్పాటు చేసేందుకు నిధు లు మం జూరు చేసింది. ఒక్కోక్క మిషన్కు రూ. 26 వేల చొప్పున ఖర్చు చేయనున్నాం. ఈ మేరకు రెండు రోజుల్లో కలెక్టర్ సమక్షంలో ఈ ప్రక్రి యను వేగ వంతం చేస్తాం.
– రాజేశ్వర్గౌడ్, జిల్లా అధికారి, నిర్మల్
నెలకు రూ. 100 ఖర్చవుతాయి..
సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ప్రతినెలా న్యాప్కిన్స్ వాడుతారు. వీటికి రూ.100 ఖర్చవుతా యి. ప్రభుత్వం ఇప్పటికే హాస్టళ్లలో నాణ్యమై భోజ నం, వసతి కల్పిస్తుండగా.. ఇప్పుడు న్యాప్కిన్స్ ఉచితంగా అందించేందుకు మిషన్లను ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉంది. ప్రభుత్వం అందించేందుకు ఏర్పాటు చేయడం అభినందనీయం.
– బీ తార, విద్యార్థిని, పదో తరగతి
ఆడ పిల్లలకు భరోసా..
సంక్షేమ హాస్టళ్లలో న్యాప్కిన్ మిషన్లు ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఆర్థిక ఇబ్బందులతోనే చాలా మంది ఆడ పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఉచితంగా అందించడంతో వారికి పూర్తి ఆర్థిక భరోసా ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వసతుల సౌకర్యాన్ని మరింతగా పెంచడంతో ఆడ పిల్లలు ఎక్కువగా చదువుకునేందుకు హాస్టళ్లలో చేరుతున్నారు.
– వనజ, గృహిణి