కెరమెరి, ఆగస్టు 13 : జీవ వైవిధ్యమే ధ్యేయంగా.. పర్యావరణ పరిరక్షణతోపాటు దేశవాళి పాడి, పంటలను పెంపొందించాలని సర్కారు సంకల్పించింది. పురాతన పంటలతోపాటు చిరుధాన్యాలు సాగు చేయాలనే లక్ష్యంతో జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ద్వారా గ్రామాల్లో కొత్తగా బీఎంసీ(బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ)లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. గతంలో ఝరి మోడీ, కెరమెరి, గోయగాం జీపీల్లో కమిటీలు వేయగా సత్ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త కమిటీలు వేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఐదేండ్ల క్రితం జీవవైవిధ్యం పరిరక్షణలో కెరమెరి మండలంలోని ఝరి మోడీ ఎంపికైంది. అప్పటి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపిక అందుకున్నది. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రకృతితోనే అన్ని జీవరాసుల భవితవ్యం ఆధారపడి ఉంది. కాలుష్యాన్ని నివారించి సర్వజీవరాసులకు ప్రాణవాయువు అందాలంటే ప్రకృతిని సంరక్షించాల్సిన అవసరమున్నది. అడవులను కాపాడుతూనే అంతరించిపోతున్న దేశవాళి పాడి.. పంటలు పెంపొందించే ధ్యేయంతో ప్రభుత్వం జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ద్వారా గ్రామాల్లో కొత్తగా బీఎంసీ(బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ)లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గతంలో ఝరి మోడీ, కెరమెరి, గోయగాం గ్రామ పంచాయతీల్లో మాత్రమే కమిటీలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ కమిటీలో సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారు. మిగతా నలుగురు సభ్యులను జనాభా ప్రాతిపదికన నియమిస్తారు. (ఇందులో ఒక మహిళ కూడా ఉంటారు).
పురాతన పంటలు, చిరుధాన్యాలే మేలు
బీటీ పంట విత్తనాలకు బదులుగా పురాతన పంటలతోపాటు చిరుధాన్యాలు సాగు చేయాలన్నదే ఈ కమిటీ ఉద్దేశం. బీటీ పంటలతో ప్రయోజనం లేదని, రాబోయే తరాలకు అధిక పోషకాలు కలిగిన పంటలను అందించాలని, ముఖ్యంగా రసాయన ఎరువులను తగ్గించి.. సేంద్రియ ఎరువులు వాడేలా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ పదార్థాలను వాడడంతో పొంచి ఉన్న ప్రమాదంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో సనాతన పంటలు పండిస్తూ, దేశవాళి ఆవులు, మేకలను పోషిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక దేశంలో ఎక్కడా లేని మచ్చలకందులు తెలంగాణ రాష్ట్రంలోని కెరమెరి మండలంలో సాగవుతున్నట్లు మొదటిసారిగా గుర్తించారు. ఇతర కందులతో పోల్చితే మచ్చల కందులకు చాలా తేడా ఉందని, రుచికరంగా ఉండడమేగాకుండా వీటిలో ప్రొటీన్స్, మిటమిన్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు. దీంతో ఆ కందులకు ఝరి బీఎంసీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి సాగు విస్తీర్ణం పెంచే లక్ష్యంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఝరి మోడీ బీఎంసీకి గుర్తింపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సూచనల మేరకు బీఎంసీ కమిటీ చేసిన పనులకు తగిన గుర్తింపు వచ్చింది. 2018లో ఝరి మోడీ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఆ కమిటీ చేసిన కార్యక్రమాలకు అప్పటి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రంతోపాటు జ్ఞాపిక అందుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో జీవవైవిధ్యం పరిరక్షణలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కెరమెరి మండలంలోని ఝరి మోడీ బీఎంసీ ఎంపిక కావడం సర్వత్ర హర్షం వ్యక్తమైంది. అదే స్ఫూర్తితో మరికొన్ని బీఎంసీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రకృతి పరిరక్షణపై పాటుపడనున్నారు.
ప్రమాదకర బీటీ విత్తనాలు వీడాలి..
ప్రమాదకరమైన బీటీ విత్తనాలను వీడాలని, పురాతన విత్తనాలతో వ్యవసాయం చేస్తే భూసారం పెరుగుతోంది. ప్రకృతి సహజసిద్ధంగా ఉన్న వనరులను కాపాడాలి. వాటి లాభాలను పొందేలా చూడాలి. కమిటీ సభ్యులకు అవగాహన లేకపోవడంతో ఇక్కడి వనరులను ఇతరులు తీసుకెళ్లి లాభాలు పొందుతున్నారు. దానిని కమిటీ సభ్యులు అడ్డుకొన్ని రాయితీ పొందాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అటవీ శాఖ మంత్రి ఆదేశాల మేరకు బీఎంసీ కమిటీలకు అవగాహన కల్పిస్తే ప్రయోజనం కలుగుతుంది. గతంలో ఝరి కమిటీ సభ్యలు పండిస్తున్న మచ్చల కందులపై రిజిస్ట్రేషన్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ పంటకు ఎంత మార్కెటింగ్ జరిగితే.. వచ్చిన ఆదాయంపై అదే స్థాయిలో రాయితీ సంబంధిత కమిటీకే దక్కుతుంది.
– పెందోర్ జల్పత్రావ్, బీఎంసీ వైస్ చైర్మన్, సాకడ
ప్రకృతి పరిరక్షణతోనే మనుగడ
ప్రకృతి పరిరక్షణతోనే మానవజాతి మనుగడ సాధ్యం. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కొంతమంది తమ స్వార్థం కోసం అడవులను నరికివేయ డం, దహనం చేయడం వంటివి చేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్లాస్టిక్ వాడకంతోపాటు ఎరువులు, పురుగుల మందుల అతిగా వాడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతింటుంది. ఈ చర్యలతో నీరు, వాయువు కాలుష్యమై ప్రకృతి సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం.
– సోన్కాంబ్లే గోపి, జీవవైవిధ్య
యాజమాన్య కమిటీ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ పశుపోషణపై ఆసక్తి పెరిగింది
ఝరి మోడీ బీఎంసీ ద్వారా పశుపోషణపై ఆసక్తి పెరిగింది. కొత్తగా బీఎంసీ ఏర్పాటు చేసిన తర్వాత పురాతన పంటలు వేయాలని సూచించారు. పశువుల పెంపకం చేపట్టాలని చెప్పారు. నాకు పూర్తి సబ్సిడీపై మేకపోతులు ఇచ్చారు. ప్రస్తుతం వ్యవసాయంతోపాటు పశుపోషణ చేస్తున్న. పత్తితో పాటు పప్పుదినుసులు, కూరగాయలు పండిస్తున్న. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పంటల్లో అధిక పోషకాలు ఉంటాయి. భూసారం కూడా పెరుగుతుంది.
– ఆదే సోనాజీ, రైతు జ్యోతినగర్ (ఝరి)