మంచిర్యాల అర్బన్, జనవరి 19 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించగా, కొవిడ్ కారణంగా రెండేండ్ల కాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించలేదు. పాత కమిటీలే మరో రెండేండ్లు కొనసాగాయి. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని అన్ని జడ్పీ, ప్రభుత్వ, ఆశ్రమ, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)ల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్ఎంసీల ఎన్నికలు నిర్వహించాలి. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల నిర్వహణలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్టం ఎస్ఎంసీల ఏర్పాటుకు పూనుకుంది. బడిలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులే సభ్యులుగా కొనసాగుతారు. ఓటరు జాబితాలో పిల్లల తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడిలో ఒకరే ఓటుకు అర్హులు.
ఓటర్లలో 50 శాతం మంది హాజరుకాకపోతే కోరం లేనట్లే, సభ్యులు చేతులెత్తే విధానం లేదా మూజువాణి ఓటుతో కమిటీని ఎన్నుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14 మంది, ఉన్నత పాఠశాలల్లో 20 మంది సభ్యులతో కమిటీలను ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో ఎన్నికలు నిర్వహించి ఎన్నుకుంటారు. వీరితో పాటు ఆరుగురు ఎక్స్ అఫీషియో, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులుంటారు. ఈ కమిటీలు రెండేండ్ల పాటు పదవిలో ఉంటాయి.
జిల్లాలోని 714 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, 86 రెసిడెన్షియల్ పాఠశాలలు, 18 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు, యూఆర్ఎస్ పాఠశాల, 5 మోడల్ స్కూళ్లలో ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 2 గంటలకు తల్లిదండ్రుల జాబితా నోటీసులో ప్రకటించనున్నారు. 22, 23 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 24న తల్లిదండ్రుల తుది జాబితా ప్రకటించనున్నారు.
ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేతులెత్తే విధానం ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. ఆపై సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్తగా ఏర్పడిన కమిటీలతో సమావేశం నిర్వహించి పాఠశాలల అభివృద్ధిపై చర్చించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు.