సారంగాపూర్, నవంబర్ 23 : క్షేత్ర స్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి క్లస్టర్ (5వేల ఎకరాల)కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ను నియమించింది. ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి సాగు చేసిన పంటలను పరిశీలిస్తూ రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలి. అయితే ఇంతకుముందు వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లకపోయినా హాజరు మాత్రం పడేది. వ్యవసాయాధికారుల గైర్హాజరుకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి, రైతులకు అవగాహనలు కల్పించే వివరాలు యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
సేవలు మెరుగుపర్చేందుకు..
రైతులకు క్షేత్రస్థాయిలో సేవలు విస్తరించడం, వ్యవసాయ అధికారుల పని తీరును మెరుగుపర్చేందుకు యాక్టివిటీ లాంగర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాల్లో పంటలను పరిశీలించాల్సిన వ్యవసాయ విస్తరణాధికారుల్లో కొంతమంది కేవలం రైతు వేదికలకే పరిమితమయ్యే వారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గతేడాది యాప్ను రూపొందించింది. అయితే యాప్లో లోపాలను ఆసరా చేసుకున్న కొంతమంది పాతచిత్రాలను నమోదు చేశారు. అవి వెలుగు చూడడంతో ఉన్నతాధికారులు యాప్ను ఆధునీకరించారు. లైవ్ లొకేషన్ ఏర్పాటు చేశారు. ఏఈవోలు ఎక్కడికెళ్లినా నిర్దేశిత సమయంలో రైతులతో ఫొటో దిగి యాప్లో పొందపరిస్తేనే హాజరుపడినట్లు లెక్క. యాప్లో నమోదు చేయని పక్షంలో ఆ రోజు సంబంధిత ఏఈవోలు విధులకు గైర్హాజరైనట్లు పరిగణిస్తారు.
17 అంశాలు నమోదు…
వ్యవసాయ రంగంలో తీసుకున్న సంస్కరణల్లో భాగంగా ఏఈవోలు యాక్టివిటీ లాగర్ యాప్లో 17 అంశాలల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్కు ఒక ఏఈవోను నియమించారు. రైతు వేదికల్లో సిగ్నల్ లేని పక్షంలో సమీప గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి ఫొటో దిగి అప్లోడ్ చేయాలి. పంటల నమోదు, రైతు బీమా, రైతు బంధు పత్రాల నమోదు, పీఎం కిసాన్ యోజన వెరిఫికేషన్, మీటింగ్లు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన తదితర విషయాలను యాప్లో పొందుపర్చాలి ఉంటుంది. క్షేత్రస్థాయి పర్యటనను ముగించుకొని తిరిగి ఏఈవోలు రైతు వేదిక వద్దకు చేరుకోవాలి. ఇలా మొత్తం 17 అంశాలతో జాబ్కార్డును తయారు చేసుకోవాలి. యాప్లో అప్లోడ్ చేసిన వివరాలు వ్యవసాయ శాఖ కమిషనరేట్కు చేరుతాయి. దాని ఆధారంగానే ఏఈవోల పని తీరుకు గ్రేడింగ్ ఇస్తారు.
రైతులకు మెరుగైన సేవలు
వ్యవసాయ శాఖలో అమలు చేస్తున్న యాక్టివిటీ లాగర్ యాప్ ద్వారా ఏఈవోల పని తీరు మరింత మెరుగు పడుతుంది. క్షేత్రస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందుతాయి. ఏఈవోలు ఉదయం రైతు వేదికకు చేరుకొని అక్కడి నుంచి ఫీల్డ్లోకి వెళ్తారు. లైవ్ లొకేషన్ యాప్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏఈవోలు అందుబాటులో ఉండడమే కాకుండా రైతులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తారు. జిల్లాలో 79 క్లస్టర్లలో ఏఈవోలు విధిగా క్షేత్ర పర్యటనలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ రైతులకు చాలా ఉపయోగపడుతున్నది.
-అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్ జిల్లా