ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీల మైదానంలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం యేటా అధికారికంగా నిర్వహిస్తున్నదని, బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిలతో కలిసి రామన్న సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
– ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 23
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 23 : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం యేటా అధికారికంగా నిర్వహిస్తున్నదని, బంజారాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీల మైదానంలో సేవాలాల్ 284వ జయంత్యుత్సవాలను నిర్వహించగా.. రామన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేవాలాల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోని సన్మార్గంలో నడవాలని సూచించారు. పట్టణంలో రూ.కోటితో బంజారా భవన్ నిర్మాణ పనులకు త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. ప్రకృతిని, సాటి మనిషిని ప్రేమించాలని, అడవులను కాపాడాలని మహారాజ్ సమాజానికి బోధించేవారని గుర్తు చేశారు. జిల్లాకేంద్రంతోపాటు ఉట్నూర్లో బంజారా భవన్ ఏర్పాటునకు ఎకరం స్థలం గుర్తించామని, ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. బంజారాల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. అందరి సహకారంతో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎస్పీ, అధికారులు, ప్రజాప్రతినిధులు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆటాపాటలు, బంజారాల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం బంజారా సేవాలాల్ జయంతి గీతం పాటల సీడీని ఆవిష్కరించారు.