ఎదులాపురం, ఏప్రిల్ 26 : గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న పనుల నిర్వహణపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం, ఉపాధి హామీ, మిషన్ భగీరథ పనుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముక్రా(కే) గ్రామానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించిందని, ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇతర గ్రామపంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. జాబ్కార్డు, మిషన్ భగీరథ, బాల్య వివాహాలు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో కిషన్, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నమ్మకం పెరిగేలా వైద్యం అందించాలి
ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రిమ్స్, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ప్రభుత్వ దవాఖానలో వైద్య చికిత్సలు, ప్రసూతి మరణాలపై సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లోనే గర్భిణులకు నిరంతరం పర్యవేక్షించి వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలో ప్రసవ మరణాల రేటును తగ్గించాలని, నిర్ణీత సమయానికి ఏఎన్సీ, బీపీ పరీక్షలు నిర్వహించాలని, హిమోగ్లోబిన్ శాతం పరిశీలించాలన్నారు. రక్తహితన నియంత్రణకు పౌష్టికాహారం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్య చికిత్సలకు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశిత పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితాలో ఎఫ్ఎల్సీ, పీఈటీ తొలగింపు, ఓటర్ కార్డుల జారీ తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్దేశించిన నమూనాలో మూడు రోజుల్లో పంపాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తూ సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు నలంద ప్రియా, తహసీల్దార్ అతిఖొద్దీన్, సాంకేతిక సిబ్బంది శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.