నేరడిగొండ, డిసెంబర్ 13 : గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 32 ట్రాక్టర్లు, 79 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో భాగంగా రోజువారీ పారిశుధ్య పనులు ఎలా ఉన్నాయి? పల్లె ప్రగతి పనులు ఎలా కొనసాగుతున్నాయో నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి పేరిట డీఎస్ఆర్ అనే యాప్ను రూపొందించింది.
నిత్యం గ్రామాల్లో చేపడుతున్న పనుల వివరాలు కార్యదర్శులు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ప్రతి రోజూ కార్యదర్శులు ఏ పని చేయాలో కార్యదర్శి ఫోన్కు మెసేజ్ వస్తుంది. దీని ప్రకారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు యాప్ అందుబాటులో ఉంటుంది. కార్యదర్శులు ప్రతి రోజూ చేసిన పనుల ఫొటోలు తీసి వివరాలు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.
నమోదు చేయాల్సిన పనులు
ప్రతి రోజూ గ్రామంలో రెండు రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయించాలి. వాటికి సంబంధించి పనికి ముందు, తర్వాత ఫొటోలను అప్లోడ్ చేయాలి. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, బృహత్ ప్రకృతి వనాల పరిశీలన, చేపడుతున్న పనులు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికలు, నర్సరీలు పరిశీలించి వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయాలి. తాగునీటి ట్యాంకుల శుభ్రత, పంచాయతీ పాలన నివేదికల నిర్వహణ చేపట్టి వాటి వివరాలు నమోదు చేయాలి. వివిధ ధ్రుకరణ పత్రాల ఆమోదం, మరణాలు, జననాల నమోదు, ఆదాయం,విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
అధికారుల భాగస్వామ్యం…
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డీఎస్ఆర్యాప్లో గ్రామ స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి వరకు భాగస్వాములను చేసింది. గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి, పారిశుధ్య పనులు నిరంతరం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షిస్తున్నారు. పనులు, వాటికి సంబంధించిన ఫొటోలను చూస్తున్నారు. ఏ గ్రామంలోనైనా అధికారి నిర్లక్ష్యం వహిస్తే వెంటనే ఆ అధికారిని సకాలంలో పనులు పూర్తి చేసి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
పనుల్లో పారదర్శకత
మండలంలోని 32 గ్రామ పంచాయతీల పరిధిలో రోజు వారీగా పనుల వివరాలు ఆయా కార్యదర్శులు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో పారిశుధ్య పనుల్లో మరింత పారదర్శకత ఏర్పడింది.
-శోభన, ఇన్చార్జి ఎంపీడీవో, నేరడిగొండ