ఎదులాపురం, జూలై 25 : యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా తప్పిదాలు చేస్తూ, తర్వాత ప్రజల ఒత్తిడికి తలొగ్గడం పరిపాటిగా మారిందన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను ప్రజల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనకి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
అలాగే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఉద్యమం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనకి తగ్గాల్సి వచ్చిందని పేరొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభంపై స్పందించిన జోగు రామన్న, సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి యువత, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో జిల్లా యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో యువతకు హామీలు ఇచ్చి, ఎన్నికల అనంతరం వాటిని విస్మరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభమైతే స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేరొన్నారు. అందువల్ల సీసీఐ సాధన ఉద్యమంలో యువత చురుకుగా పాల్గొని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమే లక్ష్యంగా ప్రతి ఒకరూ ఐక్యంగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.