గర్మిళ్ల, సెప్టెంబర్ 7 : రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశించారు. పోలీసు కమిషనరేట్ పరిధి పోలీసు ఉన్నతాధికారులతో గురువారం రామగుండం పోలీసు కమిషనరేట్లో సీపీ రెమో రాజేశ్వరి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని సూచించారు.
అంతర్ జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు, మావోయిస్టులపై నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్, కమ్యూనిటీ కనెక్ట్, పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాలు, మద్యం, ఆయుధాలు ఇతర అక్రమ రవాణాను నియంత్రించడం తదితర అంశాలపై చర్చించారు. 80 ఎండ్ల పైబడిన వృద్ధులు, మూడో వంతు అంగవైకల్యం ఉన్న వారికి భారత ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం వారికి ఓటు వేసే విధంగా ప్రత్యేక విభాగాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్, జగిత్యాల ఎస్పీ భాస్కర్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్రావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.