నిర్మల్ టౌన్, అక్టోబర్ 14 : కడెం మండలంలోని రాంపూర్, మైసమ్మపేట గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు సర్వే చేసి నివేదికలు త్వరగా అందజేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశమై మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని ఈ గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెండు గ్రామాల్లో 94 కుటుంబాలు జీవనం ఉంటున్నాయన్నారు. వారికి అవసరమైన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను, ఇతర ప్రాంతాల్లో కేటాయించే విధంగా సర్వే చేసి నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.అటవీ, రెవెన్యూ, విద్యుత్శాఖ ఆధ్వర్యంలో నచ్చన్ ఎల్లపూర్ వ్యవసాయ భూమిలో, మద్దిపడగ లో ఇళ్ల స్థలాల సర్వే చేపట్టాలన్నారు.అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ గజానంద్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఎదులాపురం,అక్టోబర్14: ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జీ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ ఈ నెల 28నుంచి డిసెంబర్ 27 వరకు టీఎస్బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ద్వారా నిర్వహించనున్నట్లు వివరించారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల17 నుంచి 25 వరకు www. tsbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.