మంచిర్యాల, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలు.. రైతన్నల పాలిట శాపాలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినోళ్లకే సెంటర్లు కేటాయించారు. కోడ్ అమల్లో ఉండగా ఇలా ఎందుకు చేశారంటే.. ‘అది మాకు సంబంధం లేదు. డీసీఎంఎస్, పీఏసీఎస్ ఏజెన్సీలు సూచించిన వారికే సెంటర్లు ఇచ్చాం’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఇదే విషయమై ఏప్రిల్ 23న ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎమ్మెల్యే చెప్పినోళ్లకే డీసీఎంఎస్ కేంద్రాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కోనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగితే బాధ్యతెవ్వరిది.. అంటూ కథనాన్ని ప్రచురించింది.
దుగ్నేపల్లి సెంటర్ను విజేందర్రెడ్డికి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే సిఫార్సు చేసిన లెటర్ను, అధికారులు అదే పేరుతో ఇచ్చిన లిస్టును సైతం ఆ కథనంలో ప్రచురించింది. అప్పటి వరకు ఎమ్మెల్యేల జోక్యం లేదంటూ చెప్పుకొచ్చిన అధికారులు.. ఇలా ఎమ్మెల్యే లెటర్, ధాన్యం కొనుగోలు కేంద్రాల లెటర్లు బయటికి రావడంతో కిందిస్థాయి కార్యాలయ సిబ్బందిపై సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా, ఇప్పుడు ఏ వ్యక్తికైతే చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ దుగ్నేపల్లి సెంటర్ ఇవ్వాలంటూ సిఫార్సు చేశారో.. ఆ సెంటర్ నిర్వాహకుడు తూకాన్ని మార్చి రైతులను ముంచుతున్నాడు.
బుధవారం ధాన్యం విక్రయించేందుకు సింగరేణి సంపత్ అనే యువకుడు ఈ సెంటర్కు వచ్చాడు. నిర్వాహకులు 41 కిలోల 400 గ్రాముల చొప్పున తూకం వేశారు. అనుమానం వచ్చిన సంపత్ పక్కనున్న ఐకేపీ సెంటర్ నుంచి తూకం తీసుకువచ్చి అదే సంచులను జోకగా, అవి ఒక్కొక్కటీ 42 కిలోల 400 గ్రాములు ఉన్నాయ్. ఇలా ఒక కిలో మైనస్ చేసి డీసీఎంఎస్ సెంటర్ వాళ్లు చేస్తున్న మోసాన్ని యువకుడు బయటపెట్టడంతో అక్కడున్న రైతులంతా అయోమయంలోపడిపోయారు. 40 కిలోలు జోకాల్సిన బస్తాకు 42 కిలోల 400 గ్రాములు ఎందుకు ఎక్కువ జోకుతున్నారంటూ ప్రశ్నించారు.
తూకంలో తేడాలు, మిల్లర్ల కోతలు కలిపి ఒక్కో సంచిపై మూడు కిలోలకు పైగా వరకు కోత పెడుతున్నారని.. ఈ మూడు కిలోల నష్టాన్ని ఎవరు భరించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలోనే కాకుండా రైస్ మిల్లుకు పోయాక అక్కడ మిల్లరు బస్తాలు తగ్గించి ట్రక్ షిట్లో రాస్తున్నారని వాపోతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి తూకంలో తేడాలు చేసిన సదరు నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
కోసమెరుపు ఏమిటంటే.. సీజన్ ప్రారంభానికి ముందు నుంచి అధికారులు రా రైస్ మిల్లులకు ఈ సారి యాసంగి ధాన్యం ఇవ్వడం లేదని చెప్పుకుంటూ వచ్చారు. పలు ఛానళ్లు, పేపర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు వెళ్లిన ప్రతిసారి యాసంగి ధాన్యం రా రైస్ మిల్లులకు ఇస్తే అది నూక ఎక్కువ వస్తది. అందుకే ఈ సారి మొత్తం ధాన్యాన్ని జిల్లాలోని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు జిల్లాలోని 19 పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. మొత్తం సేకరించే లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఈ 19 మిల్లులకు దాదాపు 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పోవాలి. కానీ ఆ లక్ష్యం పూర్తి కాకుండానే పెద్దపల్లిలో 45 మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు.
సరే ధాన్యం సెంటర్లలో ఉండకూడదు త్వరగా మిల్లులకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ట్యాగింగ్ ఇచ్చారనుకుంటే.. తాజాగా మంచిర్యాల జిల్లాలోని 13 రా రైస్ మిల్లులకు సైతం ట్యాగింగ్ ఇచ్చారు. మరి ముందేమో రా రైస్ మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వమని చెప్పిన అధికారులు.. ఇప్పుడు ఎలా ఇచ్చారు అనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా అధికారులు ఇప్పటికైనా రైతులను ఇబ్బందులు పెట్టకుండా తూకం తేడాలను తగ్గించి, మిల్లర్ల కట్టింగ్ను నివారించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా ఇన్ని రోజులు రైతులను మోసం చేసి దుగ్నేపల్లి సెంటర్ నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకుంటారా..లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
ధాన్యం కొనుగోళ్ల సెంటర్లు ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకు కేటాయించలేదని, ఏజెన్సీలు చెప్పినోళ్లకే కేటాయించామని అధికారులు చెప్పినా.. అది ఎంత వరకు నిజమనేది తెలియడం లేదు. ఎందుకంటే జైపూర్ మండలం శివ్వారంలో గతంలో డీసీఎంఎస్ సెంటర్ను నిర్వహించిన సమ్మయ్య అనే వ్యక్తికి కాకుండా కొత్త వ్యక్తికి కేటాయించారు. దీనిపై సదరు వ్యక్తి ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సంఘం చెప్పినా జిల్లా అధికారులు సెంటర్ను మార్చలేదు.
దీంతో ఆయన హై కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఇలా ఎలా చేస్తారు.. ఎన్నికల సంఘం ఇచ్చిన డైరెక్షన్ను అనుసరించాలంటూ తేల్చి చెప్పింది. అప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణకు అప్పీల్ చేసినట్లు తెలిసింది. విషయం పెద్దది కావడంతో హుటాహుటిన సమ్మయ్యను కలెక్టరేట్కు పిలిపించుకున్న అధికారులు సెంటర్ తిరిగి కేటాయిస్తునట్లు లెటర్ ఇచ్చారు. మరి ఎమ్మెల్యే చెప్పినోళ్లకు సెంటర్ ఇవ్వనప్పుడు..
ఏజెన్సీ చెప్పినోళ్లకే సెంటర్ ఇచ్చినప్పుడు.. అధికారులు తిరిగి సమ్మయ్యకు ఎందుకు సెంటర్ కేటాయించారని ఆరా తీయగా.. డీసీఎంఎస్ ఏజెన్సీ సెంటర్ల నిర్వాహకుల పేర్లను సూచిస్తూ పంపిన తొలి జాబితాలో సమ్మయ్య పేరే ఉన్నట్లు తెలిసింది. జిల్లా స్థాయి ఉన్నతాధికారి ఒకరు ఉద్దేశపూర్వకంగా సమ్మయ్య పేరును తీసేసి దాని పక్కన (ఫర్ మౌనిక బై విశ్వంబర్రెడ్డి) అని రాసి పంపించారట. ఇలా రాసి పంపిన పత్రం ఇప్పుడు తాజాగా నమస్తే తెలంగాణ చేతికి చిక్కింది. ఇలా ఇష్టం వచ్చినట్లు సదరు అధికారి లిస్టును ఫైనల్ చేయనందుకే అప్పుడున్న డీసీఎస్వో తుది జాబితాలో సంతకం చేయలేదని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో పని చేసే అధికారులే చెబుతున్నారు.