Nagoba Jatara | ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా(పడియోరు) జాతరకు వేళయింది. నేడు(శుక్రవారం) పుష్యమాసంలో వచ్చే అమావాస్య కావడంతో అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గల గోదావరి(హస్తలమడుగు) నుంచి గంగాజలాన్ని(ఝరి) తీసుకొచ్చారు. ఈ జలంతో శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలో భాగంగా నాగోబాకు అభిషేకం చేస్తారు. దీంతో జాతర అధికారికంగా ఏడు రోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడి శా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు.
విదేశాల నుంచి పర్యాటకులు, సం దర్శకులు వచ్చి దర్శించుకుంటారు. ఇప్పటికే గంగాజలంతో మర్రిచెట్ల వద్ద మెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా ఐదు రోజులపా టు బస చేశారు. నేటి సాయంత్రం సంప్రదాయబద్ధంగా ఎడ్లబండ్లలో గోవాడ్కు చేరుకుంటారు. రాత్రి ఆలయాన్ని పవిత్ర గంగాజలం తో శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేస్తారు. నైవేద్యం సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. ఆలయంలో ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేస్తారు. వీటికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకుంటారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజనుల నమ్మకం. కాగా, ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.
కేస్లాపూర్ నాగోబా జాతరకు ఘనమైన చరిత్ర ఉంది. క్రీ.శ.740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియోరు శేషసాయి అనే నాగభక్తుడు నాగదేవతను దర్శించుకోవడానికి నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేరని చెబుతారు. శేషసాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పం తాకి వెనుదిరుగుతాడు. దానధర్మాలు చేయడం ప్రారంభిస్తాడు. లోక సందర్శనం ముగించుకున్న నాగరాజు శేషతల్పంపై ఆసీనుడవుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకుని నాగేంద్రుడు ఆగ్రహిస్తాడు. శేషసాయిని అంత మొందించేందుకు భూలోకానికి వస్తాడు. గమనించిన శేషసాయి ప్రాణభీతితో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్ పడమార్ దగ్గరకు వెళ్తాడు.
నాగరాజును శాంతిపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు వంటి ఏడు రకాలతో నైవేద్యం సమర్పిస్తాడు. గోదావరి వద్ద గల హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా ప్రయాణించి ఆ గంగాజలంతో నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి అక్కడే తన నివాసంగా మార్చుకుంటాడు. అప్పటి నుంచి యేటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజ నిర్వహిస్తున్నారు.
నాగోబా దేవతకు మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశంలో 22 తెగలు ఉన్నాయి. ఇందులో ఏడుగురు దేవతలను కొలిచేవారంతా మెస్రం వంశస్తులు. మడావి, మర్సుకోల, పుర్కా, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత ఇలా ఇంటిపేర్లు గలవారు మెస్రం వంశంలోకి వస్తారు. కాగా.. వీరు మహాపూజ నిర్వహించిన అనంతరం ఇతరులు నాగోబాను దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇది మెస్రం వంశీయుల సంప్రదాయం.
మెస్రం వంశానికి చెందిన మహిళలు వంటలు చేయడానికి గోవాడ్లో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజకు కావాల్సిన నైవేద్యాలు వండుతారు. గోవాడ్లో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. వందలాది మంది మెస్రం వంశస్తుల మహిళలు వంతులవారీగా వంటలు చేస్తారు.
జాతర సందర్భంగా యేటా నిర్వహించే దర్బార్కు ప్రత్యేకత ఉంది. 78 ఏండ్ల క్రితం మారుమూల గ్రామాలకు సౌకర్యాలు లేవు. గిరిజనుల వద్దకు అధికారులు వచ్చేవారు కాదు. ఈ సమయంలోనే గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్డార్ఫ్ జిల్లాకు వచ్చారు. కేస్లాపూర్లో జరిగే జాతర గురించి తెలుసుకున్నారు. దీనిని గిరిజనుల సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చుకుని దర్బార్ ఏర్పాటు చేశాడు. ఇందులో గిరిజనుల సమస్యలపై చర్చించారు. హైమన్డార్ఫ్ 1946లో మొదటి దర్బార్ను నాగోబా జాతరలో నిర్వహించారు. అప్పటి నుంచి యేటా గిరిజనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్బార్ను ఐటీడీఏ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.