ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 11 : పట్టణంలోని శాంతినగర్ శ్రీ ముత్యాల పోచమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహిళా భక్తులతో గంగనీళ్ల జాతర అంగరంగవైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ అధ్యక్షుడు నగేందర్రావు, గౌరవాధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల నారాయణ ముందుగా ఆలయంలో పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన చండీ ఉపాసకుడు పాళెం మనోహర్మశర్మ, ఆలయ అర్చకుడు నిమ్మగడ్డ శరత్చంద్ర శర్మ బృందం ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వరకు శోభాయాత్రగా వెళ్లారు. గోదావరిలో సంప్రదాయ పద్ధతిలో అమ్మవారి విగ్రహాలకు అభిషేకం చేశారు. గంగతెప్పకు పూజలు నిర్వహించారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, బిందెల్లో నీటితో పలు వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకు వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, గోదావరి జలాలతో అమ్మవారి మూల విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఈ ఉత్సవాలకు ఖానాపూర్తో పాటు, సమీప గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.