ఉట్నూర్ రూరల్, జనవరి 21: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ కోర్డు జడ్జి దుర్గారాణి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు మండలంలోని లక్షెట్టిపేట్ గ్రామంలో శనివారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం, గృహహింస చట్టం, మెంటెయినెన్స్, న్యాయ సేవా సంస్థ అందించే సేవలతో పాటు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, గదులు, తాగునీరు, మరుగుగొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మండలంలోని లాల్టెక్డిలోని గిరిజన పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. వాహన చట్టంతో పలు చట్టాలపై గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అశోక్, రాజు, గ్రామస్తులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 21 : బాలికలు, యువత హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ప్రమీలాజైన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జడ్జి హాజరై మాట్లాడారు. విద్యకు పేదరికం అడ్డు కాదన్నారు. తల్లిదండ్రుల ఆశయ దిశగా నడవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధాయులు పాల్గొన్నారు.