దిలావర్పూర్, ఏప్రిల్ 9 : కార్పొరేట్ కళాశాలలో చదువుకునే విద్యార్థినులకు దీటుగా, కేజీబీవీల్లో చదువుకునే పేద పిల్లలు భవిష్యత్లో సెట్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్షను సహకారం చేసే దిశగా రాష్ట్ర సర్కారు, కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులు ఓ అడుగు ముందుకేశారు. కేజీబీబీవో చదువుకునే వారి భవితకు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంతో మొదటిసారిగా ఉచితంగా ఎంసెట్ శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలోని ఐదు కేజీబీవీ కళాశాలలను ఎంపిక చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ఎంపిక చేసి వారికి ఉచితంగా జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీ కశాశాలలో ఎంసెట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎంపికైన కేజీబీవీ కళాశాలలివే..
ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేజీబీవీ కళాశాలల నుంచి విద్యార్థినులను ఎంపిక చేయనున్నారు. ఇందులో దిలావర్పూర్ కేజీబీవీ కళాశాల నుంచి 20 మంది, నర్సాపూర్(జీ) నుంచి 20, జామ్ నుంచి 20, భైంసా నుంచి 20, లక్ష్మణచాందకు చెందిన 20 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వీరంతా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 400 పైగా మార్కులు సాధించిన వారే కావడం గమనార్హం.
నిష్ణాతులైన ఆర్పీలతో శిక్షణ..
నిష్ణాతులైన ఆర్పీలతో జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీ కళాశాలలో వివిధ కళాశాలల నుంచి ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 100 మంది విద్యార్థినులకు గాను ఎంపీసీ నుంచి 50 మంది, బీపీసీ నుంచి 50 మందిని ఎంపిక చేశారు. వీరికి సోమవారం (10.4.23) నుంచి ఉదయం 5.30 గంటలకే శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ పరీక్ష, ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. ఈ కళాశాలల్లో చదువుకునే విద్యార్థినులకు ఈ సంవత్సరం మంచి ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.
నేటి నుంచి ప్రారంభం..
నిర్మల్ అర్బన్లోని కస్తూర్బాగాంధీ కళాశాలలో 100 మంది విద్యార్థినులకు ఉచితంగా ఎంసెట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఈ శిక్షణ కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, కేజీబీవీల నుంచి విద్యార్థినులు ఇంజినీరింగ్, మెడిసిన్లో రాణించాలన్నదే తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం వారికి అన్ని విషయాల్లో తర్ఫీదునిస్తామని పేర్కొంటున్నారు.
చదువుకోవాలనే కోరికను నిజం చేస్తున్న ప్రభుత్వం..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నాకు 459/470 మార్కులు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలోనూ మంచి మార్కులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఇంటర్ పాసైన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నా. తమది పేద కుటుంబం కావడంతో డబ్బులు పెట్టి చదివించే స్థోమత మా ఇంట్లో లేదు. మూడు రోజుల క్రితం మా ప్రిన్సిపాల్ అపర్ణ మేడం మా ఇంటికి ఫోన్ చేశారు. ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాం రమ్మన్నారు. పేద విద్యార్థినులు పై చదువులు చదువుకోవాలన్న కోర్కెను రాష్ట్ర సర్కారు, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు నిజం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం.
– కే భోజవ్వ, ఎంపీసీ, కేజీబీవీ దిలావర్పూర్
మంచి ర్యాంక్ సాధించడమే లక్ష్యం
ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా శిక్షణకు వెళ్తున్న. నేను దిలావర్పూర్ కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివా. మాది తానూర్ మండలం హంగిర్గా గ్రామం. ఇంటర్లో మంచి మార్కులు వస్తాయి. నిర్మల్లోని కస్తూర్బాగాంధీ కళాశాలలో ఉచితంగా ప్రభుత్వం ఎంసెట్ శిక్షణ ఇస్తుందని, రావాలని మా టీచర్ ఫోన్ చేసింది. నేను కూడా భవిష్యత్లో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న. అందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
– కే స్రవంతి, తానూర్ మండలం హంగిర్గా గ్రామం