ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి
ఇప్పటికే కలెక్టర్లకు జాబితా అందజేత
ప్రభుత్వ ఆదేశాల మేరకే పారదర్శకంగా వర్తింపు
జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఉపాధి
నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల ఉపాధిని మెరుగుపర్చి, వారిని పేదరికానికి దూరం చేసేందుకు ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తనతో పాటు మిగతా 9 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేస్తారని చెప్పారు. ప్రభుత్వం సూచించిన యూనిట్లతో పాటు జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నాయని, త్వరలోనే వీటిని అందజేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో దళితబంధు అమలు.. లబ్ధిదారుల ఎంపికపై ఆయన ‘నమస్తే తెలంగాణ’ కు సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..
దళితుల అభ్యున్నతికి సర్కారు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ప్రభుత్వం వీరికి అవసరమైన యూనిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళిత బంధు అమలు, లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’ కు సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే: ఉమ్మడి జిల్లాలో దళితులు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి?
మంత్రి: చాలా మేరకు దళితులు పేదరికంలో మగ్గుతున్నారు. వారికి ఆర్థిక చేయూతను అందించి, వివిధ పథకాల ద్వారా వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం వల్ల దళితులు ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పేదరికం నుంచి బయటపడుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
మంత్రి: ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ముగిసింది. శాచిరేషన్ పద్ధతిలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఉన్న దళితులందరినీ వందశాతం ఎంపిక చేశాం. ప్రభుత్వ ఆదేశాలను ఆయా జిల్లాల కలెక్టర్లు అమలు చేసి లబ్ధిదారులకు పథకాలు వర్తింపజేసే చర్యలు తీసుకుంటారు. త్వరలో లబ్ధిదారులకు యూనిట్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం.
నమస్తే :ఉమ్మడి జిల్లాలో ఎంతమందిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి?
మంత్రి: నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం మొదటి విడుతలో భాగంగా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఆయా రంగాల్లో అనుభవం ఉండడంతో పాటు వారికి వచ్చిన పనుల ద్వారా ఉపాధి పొందేవారికి అవసరమైన యూని ట్లను అందిస్తాం. రెండో విడుతలో ప్రతి నియోజకవర్గం నుంచి 2 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఎస్టీలు, బీసీలతో పాటు పేదలందరికీ ఆర్థికంగా చేయూత ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
నమస్తే : జిల్లాలో ఎలాంటి పథకాలు అమలయ్యే అవకాశాలున్నాయి?
మంత్రి: దళితబంధులో ప్రభుత్వం కొన్ని పథకాలను సూచించింది. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో ఉపాధి పొందే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పత్తి ఆధారిత పరిశ్రమలు, టెక్స్టైల్ లాంటి యూనిట్లు అవసరమున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వరి ఎక్కువగా సాగవుతుండడంతో ఇథనాల్ పరిశ్రమలు, నాలుగు జిల్లాల్లో పామాయిల్ లాంటి వాటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి . వీటితో పాటు ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలకు కూడా అవకాశం ఉంది.
.