ఎదులాపురం, ఫిబ్రవరి 6 : అర్జీలను సత్వరమే పరిష్కరించాలని రాహుల్ రాజ్ అన్నా రు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులను సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయా శాఖల అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ప్రతి నెల 3 న అధికారులతో సమావేశం
ప్రతినెల 3 వ తేదీన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు, ఒకవేళ ఆ రోజున సెలవు ఉంటే మరుసటి రోజు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంక్షేమ శాఖల సహకారంతో ఉపాధి అవకాశాలను సాధ్యమైన వరకు కల్పించాలన్నారు. గత రెండేళ్లలో చేపట్టిన ప్రగతి నివేదికలు సమర్పించాలన్నారు. అదేవిధంగా ఐటీడీఏ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై ఉట్నూర్లో గురువారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఎన్.రిజ్వాన్ భాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, ఆర్టీవో రమేశ్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.