ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) సభ్యులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అనాటమీ, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, అనస్తీషియాలో పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. బృందం సభ్యులు వచ్చారు. దవాఖానల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ విభాగాలు తిరుగుతూ వివరాలు నమోదు చేసుకున్నారు. వైద్య సిబ్బంది, రోగులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర నివేదికను ఎంసీఐకి సమర్పిస్తామని తెలిపారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 14 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ దవాఖానలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం సభ్యులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ విభాగాలను తనిఖీ చేశారు. కాగా, రిమ్స్లోని అనాటమీ, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, అనస్థీషియా విభాగాల్లో రిమ్స్, సూపర్స్పెషాలిటీలో పీజీ సీట్ల కోసం దరఖాస్తులు చేశారు.
ఈ మేరకు వివిధ రాష్ర్టాల మెడికల్ కళాశాలల నుంచి వైద్య బృందం సభ్యులు వచ్చారు. ఉదయం నుంచి ఆయా విభాగాల్లో ఎంసీఐ బృందం సభ్యులు తనిఖీలు చేపట్టి వివరాలు నమోదు చేసుకున్నారు. పీజీ సీట్ల కోసం ఇక్కడ అనువైన సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉన్నాయో ఆరాతీశారు. అనాటమీ(డాక్టర్ కిరణ్), ఎస్పీఎం (డాక్టర్ నాగేందర్ నాయుడు), జనరల్ మెడిసిన్ (డాక్టర్ సత్యనారాయణ), డెర్మటాలజీ (డాక్టర్ దాదా పీర్), అనస్థీషియా (డాక్టర్ శ్రీనివాసులు) వేర్వేరుగా తనిఖీలు చేపట్టారు. వైద్యసిబ్బందితో మాట్లాడారు. వారు అందిస్తున్న సేవలను వీడియో రికార్డింగ్ చేసుకున్నారు.
అనంతరం ఆయా విభాగాల వార్డులు తిరుగుతూ రోగులు, వారి వెంట వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ఐదు విభాగాల్లో పీజీ సీట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ నమోదు చేసుకున్న వివరాలను ఎంసీఐ కమిటీకి సమర్పించనున్నారు. వారి వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, రిమ్స్ సూపర్స్పెషాలిటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఇద్రీస్ అక్బానీ, ఐదు విభాగాల హెచ్వోడీలు డాక్టర్లు సురేశ్, విద్యావిల్సన్, వంజరి, నాగరాజ్, హేమనీ (ఇన్చార్జి హెచ్వోడీ), ఆర్ఎంవోలు తొడసం చందు, చంపత్రావ్, వైద్యులు సుమలత, వెంకట్రెడ్డి, తానాజీ ఉన్నారు.