నార్నూర్, జనవరి 9 : మండలంలోని కొత్తపల్లి(హెచ్)లో గల బంజారా దీక్షభూమి ఆధ్యాత్మిక శోభను సంతరించుకొనున్నది. దీక్షగురువు శ్రీసంత్ ప్రేమ్సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో యేటా జనవరి 11వ తేదీన గురు, శిష్యుల మిలాన్(దీక్ష దివస్)ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దీక్షభూమిలో కొలువుదీరిన బంజారాల కులదైవాలైన జగదాంబాదేవి, రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వీ, ధర్మగురువు రామారావ్ మహారాజ్ ఆలయన్ని ముస్తాబు చేశారు. ఇక్కడ బోగ్భండార్ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇందులో భాగంగా శ్రీసేవాలాల్ మహారాజ్ పల్లకీని గంగాపూర్(తండా)నుంచి వైభవంగా శోభాయాత్రగా కాలినడకన దీక్షభూమికి చేరుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. 15వ తేదీ వరకు భజన, కీర్తనలు కొనసాగుతాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తుండగా.. గురుకృపా దివస్కు ప్రముఖులు హాజరుకానున్నారు.
దీక్ష భూమి ప్రత్యేకత
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శంకర్లోద్దిలో 1978వ సంవత్సరంలో దీక్ష గురువు శ్రీసంత్ ప్రేమ్సింగ్ మహారాజ్ తపస్సు చేశారు. జనవరి 11, 1979న మహారాష్ట్రలోని పౌరదేవి నుంచి ధర్మ గురువు రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వీ రామారావు మహారాజ్ శంకర్లొద్దికి వచ్చారు. ప్రేమ్సింగ్కి మహారాజ్ ఉపదేశించారు. సమాజ జాగృతం కోసం తండాలకు వెళ్లి ధర్మ ప్రచారం చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తోపాటు ప్రతి రాష్ట్రంలో ధర్మ ప్రచారం చేస్తున్నారు. 1988లో శంకర్లొద్ది గ్రామంలో శివయజ్ఞం, 1992లో కొత్తపల్లి (హెచ్) ప్రేమ్సింగ్ ఆలయం వద్ద లక్ష్య చండీయజ్ఞాన్ని నిర్వహించారు. ఆనాటి నుంచి యేటా జనవరి 11వ తేదీన జాతీయ దీక్షభూమి వద్ద గురు, శిష్యుల(మిలాన్ దివస్) గురుకృపా దివస్ను భక్తిశ్రద్ధలతో బంజారులు నిర్వహిస్తారు.
సామాజిక చైతన్యంపై హితబోధ..
జనవరి 11న భక్తులు ఇతర రాష్ర్టాల నుంచి దీక్షభూమికి తరలివస్తారు. బోగ్భండార్ ఎదుట భక్తులను దీక్ష గురువు సామాజిక అంశాలపై చైతన్య పరుస్తారు. మత్తుపానియాలు, పొగాకు, కల్లు, గంజాయి, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలని వివరిస్తారు. బాల్యవివాహాలు చేయవద్దని, వరకట్నం ఇచ్చిపుచ్చుకునే ధోరణి మానుకోవాలని, పిల్లలను తప్పకుండా పాఠశాలలకు పంపించాలని, విద్యా బోధన చేయించాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని భక్తులకు హితబోధ చేస్తారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
యేటా జనవరిలో గురుశిష్యుల(మిలన్ దివస్)ను నిర్వహిస్తాం. సమాజ చైతన్యం కోసం ఆధ్యాత్మికతపై వివరిస్తాం. నేటి తరానికి సంస్కృతీసంప్రదాయాలతోపాటు సన్మార్గంలో నడవాలని వివరిస్తాం. శాంతి, అహింసతో ఏదైనా సాధ్యమవుతుందని తెలుపుతాం. ఏర్పాట్లు మాత్రం ఘనంగా చేశాం.
– సేలావాల్ శ్రీసంత్ ప్రేమ్సింగ్ మహారాజ్, దీక్షగురు.