హాజీపూర్, ఆగస్ట్ 8 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 16వ డివిజన్ (ముల్కల్ల)లో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. స్వల్పంగా వర్షం కురిసినా రహదారులపై నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిల్వ రోజులు తరబడి ఉండటంతో దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి నీరు నిల్వ లేకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పారిశుధ్య పనులను ముమ్మరం చేసి సీజనల్ వ్యాధుల బారిన పడుకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.