మంచిర్యాల అర్బన్, ఆగస్టు 7: మత్స్యకారుల కోసం రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నది. చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలు వదలడంతో పాటు, మార్కెటింగ్ అవకాశాల కోసం రుణాలు కూడా మంజూరు చేస్తున్నది. ప్రభుత్వ పథకాలలో లబ్ధిపొందాలంటే మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం తప్పని సరి. దీంతో సభ్యత్వం పొందేందుకు మత్స్యకారులు శ్రద్ధ చూపుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు కనీస సామర్థ్యాల పరీక్ష నిర్వహించి సభ్యత్వం ఇస్తున్నారు.
ప్రభుత్వ పథకాలతోనే పెరుగుతున్న సభ్యత్వాలు…
మంచిర్యాల జిల్లాలో మత్స్య సహకార సంఘాలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడమే కాకుండా వాటిని విక్రయించేందుకు స్టాళ్లు, మోటారు సైకిళ్లు, దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి నాలుగు చక్రాల వాహనాలు ఇస్తుండడంతో సొసైటీల్లో సభ్యులుగా చేరేందుకు పోటీ పడుతున్నారు. జిల్లా ఏర్పడిన నాటికి మొత్తం 67(62 పురుషుల, 5 మహిళా) సొసైటీలుండగా, ఇందులో 4,647 మంది (4,503 పురుషులు, 144 మహిళలు) సభ్యులుగా ఉన్నారు. 2021-22 నాటికి సొసైటీల సంఖ్య 106(79 పురుషులు, 27 మహిళల)కి చేరింది. అలాగే సభ్యులు 6,328 మంది (5,117 పురుషులు, 1,211 మహిళలు) ఉన్నారు.
సంఘం ఏర్పాటుకు ఉండాల్సిన కనీస వనరులు…
గ్రామంలో నీటి వనరులు అంటే నీటి విస్తీర్ణం వర్షాధార చెరువులైతే కనీసం 22 ఎకరాలు ఉండాలి. కాలువ లేదా సంవత్సరం పొడవునా నీరు నిలువ ఉండే చెరువులైతే కనీసం 11 ఎకరాలు ఉండాలి.
అదే గ్రామంలో స్థిర నివాసమున్న మత్స్యకార కుటుంబాలు కనీసం 11 ఉండాలి.
గ్రామం ఏదైనా ఇతర మత్స్యసహకార సంఘం పరిధిలో ఉంటే ఆ సంఘం నుంచి విడదీస్తూ తీర్మానించాలి.
వయస్సు 18 ఏండ్లు నిండి, 60 ఏండ్లలోపు ఉండి మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారు, స్థానిక ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. ఇతర వెనుకబడిన సంఘాల్లో ఉన్న వారు అనర్హులు.
సభ్యత్వం కోసం పరీక్ష ఇలా…
సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందు కోసం ఓ కమిటీ ఉండగా, కన్వీనర్గా జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా సంఘం అధ్యక్షుడు, మరో ముగ్గురు అనుబంధ శాఖల అధికారులు ఉంటారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని సంఘంలో సభ్యులుగా తీసుకుంటారు. ఇందులో ప్రధానంగా…చేపలు పట్టడానికి వల విసరడంతో పాటు చేపలు జారి పోకుండా వల లాగాలి.
రిజర్వాయర్, చెరువుల్లో ఈత కొట్టడం రావాలి.
ప్రభుత్వం రాయితీతో ఇచ్చే ముడిసరుకుతో వల తయారు చేయడం(అల్లడం) రావాలి.
చెరువులు, రిజర్వాయర్లలో తెప్పలు సరిగ్గా నడపడం రావాలి.
కేసీఆర్ సార్ న్యాయం చేస్తుండు…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని కుల సంఘాలకు న్యాయం జరుగుతున్నది. మత్స్యకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో పెంచుకునేందుకు ఉచితంగా చేప పిల్లలను అందించడమే కాకుండా మార్కెటింగ్కు కావాల్సిన సదుపాయాలు కల్పించింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందుకొని లబ్ధి పొందేందుకే మత్స్యకారులు పెద్ద సంఖ్యలో సొసైటీల్లో సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. చెరువు, కుంట విస్తీర్ణం ఆధారంగా మెంబర్ షిప్ ఇస్తుండడంతో అందరికీ మేలు కలుగుతున్నది. ఇలా అన్ని రకాలుగా మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.
– గుమ్ముల నాగరాజు, గంగపుత్ర సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు, మంచిర్యాల
అద్భుతం.. అర్బన్ పార్కు
చెన్నూర్ మండలం కిష్టంపేట సమీపంలోని అర్బన్ పార్కు.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యాయామం సెట్.., వాకింగ్ ట్రాక్.., రకరకాల కుర్చీలు.., రంగురంగుల బొమ్మలతో.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. దీంతో నిత్యం సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. కాగా, మరిన్ని పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో బోటింగ్తో పాటు పలు రకాల పనులు చేపట్టనున్నట్లు ఎఫ్ఆర్వో మధుసూదన్ తెలిపారు. ఈ పార్కులో సందర్శకులకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా తీసుకుంటున్నట్లు ఎఫ్బీవో పేర్కొన్నారు.