మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జన్నారం, జనవరి 4 : చుట్టూ దట్టమైన అడవి.. ప్రకృతి అందాలు ఓ వైపు కనువిందు చేస్తుంటే.. మరోవైపు పక్షుల కిలకిలలు పక్షి ప్రేమికులు, పరిశోధకులను పలుకరించాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్లో రెండో బర్డ్వాక్ శనివారం ప్రారంభమైంది. దేశంలో వివిధ రాష్ర్టాలు, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పక్షి ప్రేమికులు, హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ట్రైనీలు దాదాపు 50 మంది బర్డ్వాక్లో పాల్గొన్నారు. కవ్వాల్ అడవుల్లో నీలుగాయికుంట, మైసమ్మ కుంట, బైసన్ కంట, కలపకుంట ప్రాంతాల్లో వివిధ జాతుల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉదయం, సాయంత్రం వేళ అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బర్డ్వాక్కు విశేష స్పందన లభిస్తున్నది. గతేడాది ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో తొలిసారి కవ్వాల్లో బర్డ్వాక్ నిర్వహించారు. ఆ సమయంలో 65 మంది పక్షి ప్రేమికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఈ ఏడాది రెండు విడుతలుగా బర్డ్వాక్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో ఒకసారి, 17, 18వ తేదీల్లో రెండోసారి ఈ బర్డ్వాక్ కార్యక్రమం ఉంటుంది.
తొలిరోజు ఫస్ట్ ఫేస్లో దాదాపు 50 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం రెండు బస్సులు, రెండు సఫారీల్లో వారిని బైసన్కుంటకు తీసుకెళ్లారు. రెండోరోజు మైసమ్మ కుంట, నీలుగాయికుం ట, కలపకుంట ప్రాంతాల్లో పక్షులను వీక్షించేందుకు తీసుకెళ్లనున్నారు. మైసమ్మ కుంటలో రాత్రి బస, భోజన వసతులు కల్పించారు. ఆదివారం మధ్యాహ్న భోజనంతో బర్డ్వాక్ ముగియనున్నది. తొలిరోజు బైసన్కుంటలో సర్పెంట్ ఈగల్, రాపీస్ట్రీపై, రెడ్ ప్లేమ్బ్యాక్ ఉడ్పి, పేంటెడ్ స్ట్రోక్, స్పాటెడ్ ఔలెట్, కామన్ బపోయి, ఎల్లో ఐడ్ బబులర్, ఆరేంజ్ హెడెడ్ త్రస్, వూలి నెక్డ్ స్టార్క్.. ఇలా వివిధ రకాల పక్షులు కనువిందు చేశాయి.
అనేక పక్షులకు నివాసం
కవ్వాల్ అభయారణ్యం చాలా రకాల పక్షి జాతులకు నివాసంగా మారింది. పక్షుల సంరక్షణ, వాటి ఆహార వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. వలస కోసం ఇక్కడికి వచ్చే పక్షులు ఇక్కడే ఉండిపోయేలా వసతులు కల్పిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో 200 నుంచి 300 రకాల పక్షులను చూస్తామను కుం టున్నాం. ఇంకొంచెం అభివృద్ధి చేస్తే మరిన్ని పక్షులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
– ఆనందిత ముఖర్జీ, పక్షి ప్రేమికురాలు, ఢిల్లీ
బర్డ్వాక్ ఎప్పుడు పెట్టినా వస్తా..
తొలిరోజే చాలా రకాల పక్షులను నా కెమెరాలో బంధించా. గతేడాది కూడా బర్డ్వాక్కు వచ్చా. కాకపోతే ఈసారి ఇంకా బాగా అనిపిస్తున్నది. నేడు కచ్చి తంగా మాకు తీరిక ఉండదనే నమ్మకం కుదిరింది. పక్షుల సంరక్షణకు కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అధికారులు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు బర్డ్వాక్ పెట్టినా రావాలనిపిస్తుంది.
– ఇందారం నాగేశ్వర్రావు, వరంగల్