సిర్పూర్(టీ), మార్చి 27 : తూకాలు తగ్గించి, వినియోగదారులను మోసం చేసే దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఎంఏ జలీల్ అన్నారు. మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఏంఎ జలీల్ ఆధ్వర్యంలో బుధవారం అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కిరాణా దుకాణాల్లో బియ్యం బస్తాలను తూకం వేసి పరిశీలించారు.
స్థానిక బస్టాండ్ ప్రాంతంలోని నౌషాద్, పైడి గిరీశ్ కిరాణా దుకాణాల్లో తూకాలు వేయగా, 26 కేజీల బియ్యం బస్తాల్లో తేడాలు అధికారులు గుర్తించారు. ఒక్కో బియ్యం బస్తాలో కిలోకు పైగా తేడాలు రావడంతో నౌషద్, గిరీశ్లపై కేసు నమోదు చేసి, ఒక్కొక్కరికీ రూ 15వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు తూకాలు సరిచూసుకొని కొనుక్కోవాలని సూచించారు.