నార్నూర్, జనవరి 2 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఖాందేవ్ జాతరకు వేళయ్యింది. తొడసం వంశీయుల ఆధ్వర్యంలో ఈ నెల 6న ప్రారంభం కానుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర నిర్వహించే ప్రాంతంతో పాటు ఆలయ ప్రాంగణంలో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తున్నారు. యేటా పూష్యమాసంలో ఖాందేవ్ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ నెల 5న మాన్కాపూర్లోని గోవర్ధన్గుట్ట వద్ద ఆ వంశస్తులు కుటుంబసమేతంగా బస చేస్తారు. మైసమాల్ దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి 6న ఖాందేవ్ ఆలయానికి చేరుకుంటారు. అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తారు.
సంస్కృతీ సంప్రదాయాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. 7న ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆ వంశం ఆడబిడ్డ పవిత్రమైన నువ్వుల తైలం తాగనున్నది.15 రోజుల పాటు జాతర అత్యంత వైభవంగా సాగనున్నది. జాతర సందర్భంగా క్రికెట్, కబడ్డీ,వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. తైలం తాగే మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రముఖులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. అదే రోజు ఆలయ ప్రాంగణంలో మినీ దర్బార్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
సంప్రదాయబద్ధంగా జాతర ప్రారంభిస్తాం
యేటా పుష్యమాసం పౌర్ణిమ రోజున సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తాం. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆటల పోటీలు కూడా నిర్వహిస్తాం.
– తోడసం నాగోరావ్, ఆలయ నిర్వాహకుడు