బెల్లంపల్లి రూరల్, ఫిబ్రవరి 8;బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ)విద్యార్థుల విజయాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. 2016లో రూ. 13 కోట్లతో నిర్మించిన అధునాతన భవనంలో ఈ విద్యాలయం కొనసాగుతుండగా, ఉత్తమ విద్యాప్రమాణాలతో గుర్తింపు సాధించింది. పేదింటి విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూ, వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తున్నది. ఐఐటీ, నీట్, తదితర జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు, యూనివర్సిటీల్లో సత్తా చాటేలా సిద్ధం చేస్తున్నది. ఇంటర్లో ఇప్పటికే మూడు సార్లు వందశాతం ఫలితాలు సాధించగా, పదో తరగతిలోనూ అదే రీతిలో ముందుకెళ్తున్నది. బోధనేతర కార్యక్రమాలతో పాటు స్వచ్ఛత, క్రీడల్లో విద్యార్థులు రాణించేలా ఇక్కడి గురుకుల సిబ్బంది ప్రోత్సహిస్తున్నది. కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా ఎదిగిన ఈ గురుకులాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వివిధ అవార్డులు దక్కించుకున్న ఈ చదువుల కొవెలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
అత్యుత్తమ ఫలితాలతో గుర్తింపు
2018 -19లో ఏర్పాటు చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ సీవోఈలో మెరుగైన ఫలితాల సాధనకు ఎంతగానో దోహదపడింది. ఆంగ్ల అధ్యాపకులు కో ఆర్డినేటర్లుగా ఉంటూ జాతీయ స్థాయి యూనివర్సిటీలు, ఐహెచ్ఎం (ఇండియన్ హోటల్ మేనేజ్మెంట్), ఐకార్ (ఇండియ న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్), సిఫ్నెట్ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫి షరీష్ అండ్ నాటికల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్), శాట్ (స్కొలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్) వంటి ఉన్నత విద్యాసంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ఇక్కడ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అధ్యాపకులు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో గత మూడేళ్లలో 39 మంది విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు.
ఐఐటీ, నీట్ ఆస్పిరెంట్లకు అండగా..
జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ,నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రి పేరయ్యే విద్యార్థులకు ఇక్కడి అధ్యాపకులు అండగా నిలుస్తున్నారు. పాఠ్యాంశాలను అంశాల వారీ గా సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తున్నారు. గత ప్రశ్నాపత్రాల సరళిని విద్యార్థులు అంచనా వేసేలా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డీ రొనాల్డ్రోస్ ఆలోచనలకు అనుగుణం గా ఎప్పటికప్పుడు అధ్యాపకులు అధ్యయనం చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి లేని బోధన అందిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ పేద విద్యార్థుల కు అందని ద్రాక్షగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలో ఉన్నత విద్యను అభ్యసించేలా చేసి వారి కలలను నిజం చేస్తున్నది. ఈ కళాశాలలో చదివిన బీ అనిల్, కే ఉమేశ్చంద్ర నీట్లో ఉత్త మ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సాధించారు. ఐఐటీ ,నీట్, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ఇ క్కడి విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్ర ప్రభు త్వం మంజూరు చేసిన రూ 2.80 లక్షల ప్రో త్సాహకాన్ని ఇటీవల మంచిర్యాల డీసీపీ అఖిల్మహాజన్ చేతుల మీదుగా అందుకున్నారు.
ఇంటర్లో వరుసగా వంద శాతం
బెల్లంపల్లి సీవోఈ మూడేళ్లుగా వరుసగా ఇంటర్మీడియట్లో వందశాతం ఫలితాలతో హ్యాట్రిక్ సాధించింది. గతేడాది గాజుల సాయికుమార్ (ఎంపీసీ)991 మార్కులతో స్టేట్ర్యాంక్ సాధించాడు. దీంతో సాయికుమార్కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ. 25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. సీవోఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులను మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి రొనాల్డ్రాస్, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి వాకాటి అరుణ ఘనంగా సన్మానించారు. సీవోఈ ఇంటర్తో పాటు ఎస్సెస్సీలోనూ వందశాతం ఫలితాలు సాధిస్తున్నది.
బోధనేతర కార్యక్రమాల్లోనూ ..
సీవోఈ బోధనేతర కార్యక్రమాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఆరంభం నుంచి విద్యాశాఖ నిర్వహిస్తున్న ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికవుతూ కొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్ధులను నడిపిస్తున్నది. ఇప్పటి వరకు 6 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఓటరు దినోత్సవం, పర్యావరణ దినోత్సవం , రాజ్యాంగ దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో విద్యాశాఖతో పాటు పలు సంస్థలు నిర్వహించే సాహిత్య, సాంస్కృతిక పోటీల్లో 23 రాష్ట్ర స్థాయి బహుమతులను సొంతం చేసుకుంది. సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏటా నిర్వహించే ఇగ్నైట్, ఆల్గోరిథం, స్ప్లాష్, సైన్స్ఫేర్ ,సూపర్ స్టూడెంట్ వంటి పలు పోటీల్లో విద్యార్థులు అనేక బహుమతులతో పాటు నగదు పురస్కారాలను సాధించి తమదైన ముద్రను సొంతం చేసుకున్నారు.
ఇటీవల బెల్లంపల్లి లో జరిగిన జోనల్ (పది జిల్లాలు) స్థాయి సైన్స్ఫేర్ లో సీవోఈ విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.స్వచ్ఛత లో మేటి ఇక్కడి విద్యార్థులు స్వచ్ఛత పాటించడంలోనూ తమకు తామే సాటిగా నిలుస్తున్నారు. సీవోఈ ప్రారంభం నుంచి హ్యాండ్వాష్తో పాటు ఇతర పరిశుభ్రతా నియమాలను పాటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. నివాస గృహం, వంటశాలల్లోని వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి గురుకుల ఆవరణలో సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టారు. వ్యర్థాలకు అర్థం చెబుతూ తల్లిదండ్రుల సహకారంతో భీమ్ అగ్రిహోం (వర్మీ కంపోస్ట్ పిట్) నిర్మించి వానపాములతో చెత్త నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోనే వ్యర్థపదార్థాల నిర్వహణలో మొదటి గురుకులంగా పేరొందింది. సేంద్రీయ ఎరువులను వాడి కళాశాల ఆవరణలో రెండు వేల మొక్కలను పెంచి రికార్డు నెలకొల్పారు. కేంద్రం నుంచి 2016 లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ దక్కించుకుంది. అంతే కాకుండా విద్యాలయంలో ఔషధ గుణాలున్న అరుదైన మొక్కలతో పాటు పూలు, పండ్లు, తీగజాతి మొక్కలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2017లో హరితమిత్ర అవార్డును సొంతం చేసుకుంది. మళ్లీ 2022లో కూడా ఈ విద్యాలయం జిల్లా స్థాయిలో స్వచ్ఛ పురస్కారం అందుకుంది.
క్రీడల్లోనూ ప్రతిభ
ఇక్కడి విద్యార్థులు చదువుతో పాటు జాతీయస్థాయి క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. ఉషూ కిక్బాక్సింగ్, సాఫ్ట్బాల్ క్రీడల్లో 12 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించి పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ, చదరంగం (చెస్), క్యారమ్స్ , ఖోఖో క్రీడల్లో 74 మంది విద్యార్థులు బహుమతులు సాధించారు. ఏటా నిర్వహించే సంక్షేమ గురుకులాల జోన్, రాష్ట్ర స్థాయి చదరంగం(చెస్) పోటీల్లో వరుసగా మూడు సార్లు రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా ఇంటర్ సొసైటీ క్రీడల్లోనూ ప్రతిభ చూపారు.
స్వేచ్ఛ విద్యా విధానానికి రోల్ మోడల్..
సంక్షేమ గురుకులాల్లో వినూత్నంగా ప్రవేశపెట్టిన ఫ్రీడం స్కూల్ (స్వేచ్ఛ పాఠశాల) కాన్సెఫ్ట్కు ఈ వి ద్యాలయం ఒక మోడల్గా నిలిచి అధికారుల నుం చి ప్రశంసలందుకున్నది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థులు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ స్వేచ్ఛాపూరిత వాతావరణం నెలకొల్పారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా సం దేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుంటారు. అనేక విషయాల పట్ల బృంద చర్చల ద్వారా విద్యార్థులే అవగాహన పెంపొందించుకునే లా ఇక్కడి ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారు. విద్యార్థుల పట్ల అజమాయిషీ ప్రదర్శించకుండా ప్రేమగా నేర్పిస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించేలా యోగా క్లాసులను తప్పనిసరిగా నిర్వహిస్తారు. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు నాయకత్వ లక్షణం, ఉపాధ్యాయుల అంకితభావం ఫలితంగా ఈ గురుకులం అనేక విజయాలకు కేరాఫ్గా నిలుస్తుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 2022 విద్యాసంవత్సరంలో ఉత్తమ విద్యాసంస్థ అవార్డును ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణితో కలిసి ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అందుకున్నారు.
బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయం 2013-14 లో ప్రారంభమైంది, రైల్వే రడగంబాలబస్తీలో అద్దె భవనంలో తాత్కాలికంగా కొనసాగింది.ఆ తర్వాత 2016లో బెల్లంపల్లి శివారులోని తాళ్లగురిజాల రోడ్డులో రూ .13 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత భవనం నిర్మించింది. దీంతో ఇక్కడికి మారింది. అనతి కాలంలోనే నాణ్యమైన విద్యాప్రమాణాలతో గుర్తింపు సాధించింది. గురుకులంలో సాధిస్తున్న ఫలితాల ఆధారంగా 2018లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా రూపుదిద్దుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికతో బోధన అందించడంతో పాటు ఐఐటీ,నీట్, ఇతర జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నది. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల కలలను సాకారం చేస్తున్నది. ప్రారంభం నుంచి నేటి వరకు పలు ఫలితాల్లో విజయ బావుటా సత్తా చాటి రాష్ట్రంలోని గురుకులాలకే తలమానికంగా ఎదిగింది.
ఉన్నత లక్ష్యం వైపు నడిపించింది..
చదువులో ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పయనించడం ఎలాగో బెల్లంపల్లి సీవోఈలో నేర్చుకున్నాను. జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలనే ఆకాంక్ష కలిగేలా అధ్యాపకులు మోటివేట్ చేశారు. ప్రస్తుతం నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎస్సీ ,నాటికల్ సైన్స్ ) కేరళలో చదువుతున్నాను. ఇక్కడి అధ్యాపకులు అందించిన ప్రత్యేక శిక్షణతో ఎంట్రన్స్ పరీక్ష రాసి సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (సిఫ్నెట్) లో సీటు సాధించగలిగాను. జాతీయస్థాయిలో కేవలం 40 సీట్లు మాత్రమే కలిగిన ఈ కోర్సులో నేను చదవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. బెల్లంపల్లి సీవోఈలో చేరేనాటికి నాకంటూ ఎలాంటి లక్ష్యం లేదు. ఇక్కడి ప్రత్యేక ప్రణాళిక, ప్రిన్సిపాల్ వ్యక్తిగత కౌన్సెలింగ్ నా ఆలోచనలను మార్చింది. సీవోఈలో అందించిన విద్యావిధానం జీవితంలో ఎన్నటికీ మర్చిపోను. ప్రస్తుతం పరిశోధనా రంగంలో రాణించాలనే నా లక్ష్యానికి సీవోఈలోనే బీజం పడింది. నా ఆలోచనలకు పదును పెడుతూ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగేంతవరకూ శ్రమిస్తా.
–ఓరుగంటి తన్మయ్, సిఫ్నెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి
సీవోఈ వల్లే నా బిడ్డ కల నెరవేరింది.
మా బాబు కోనూరి ఉమేశ్చంద్ర ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బెల్లంపల్లి సీవోఈలో చదివాడు. వాడికి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. నీట్ లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్లో సీటు పొందాడు. ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేమెప్పుడు వాడు డాక్టర్ చదువుతాడని అనుకోలేదు. సీవోఈ లో అధ్యాపకుల బోధన, ప్రిన్సిపల్ సార్ అందించిన గొప్ప సహకాంతో నా బిడ్డ డాక్టర్ చదవాలన్న కోరిక నెరవేరింది. ఉత్తమ క్రమశిక్షణ, ప్రత్యేక తరగతుల వల్లే ఇక్కడ చదివే పిల్లల్లో ఆత్మైస్థెర్యం కనిపిస్తున్నది. నీట్ ప్రిపరేషన్ సమయంలో సెలవుల్లో కూడా ప్రత్యేకంగా చదివించడం కొంత ఇబ్బంది అనిపించేది. ఊళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా రానీయకుండా అక్కడే చదివించారు. మొదట్లో ఈ విషయం తల్లిదండ్రులుగా మాకు బాధనిపించినా ఈ రోజు మా బాబు డాక్టర్ చదువుతుండడం ఎంతో సంతోషాన్నిస్తున్నది.
–కోనూరి శంకర్, బట్వాన్పల్లి గ్రామం
ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాం.
సీవోఈలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇక్కడి విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం, ఆర్థిక వెనుకబాటు వంటి అడ్డంకులను ఎదుర్కొవడం గమనించాం. విద్యార్థుల్లో అత్మన్యూన్యత భావాన్ని పొగొట్టి కరాడీపాత్, ఆపరేషన్ ఐన్స్టీన్, ఆపరేషన్ బ్లాక్బోర్డ్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఆంగ్ల విద్యతో పాటు గణితం, సైన్స్ కాన్సెఫ్ట్స్పై పట్టు సాధిస్తున్నాం. బోధనా సిబ్బందికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తూ విద్యా బోధన సాగేలా సమన్వయం చేస్తున్నాం. సంస్థ అధికారులు అందిస్తున్న సలహాలతో అవసరాన్ని బట్టి విషయ నిపుణులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రుల సహకారంతో గురుకులం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. అందరం కలసికట్టుగా చేపడుతున్న విద్య ,విద్యేతర కార్యక్రమాలు గొప్ప ఫలితాలను ఇస్తూ సీవోఈని ఒక మోడల్గా నిలపడం ఆనందానిస్తున్నది. ఇక్కడి విద్యార్థులు సాధిస్తున్న అనేక విజయాలు సమష్టి కృషికి నిదర్శనం.
–కే ఐనాల సైదులు, ప్రిన్సిపాల్ సీవోఈ బెల్లంపల్లి)