నిర్మల్ టౌన్, డిసెంబర్ 21 : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటరు తుది జాబితాకు కసరత్తు వేగంగా సాగుతున్నది. జనవరి 31, 2022 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 8 వరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని బీఎల్వో కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, తుది జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
బోగస్ ఓటర్లపై ప్రత్యేక నిఘా..
వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటరు జాబితా రూపొందించేందుకు కలెక్టర్తో పాటు, రెవెన్యూ యంత్రాంగం బోగస్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 8 వరకు జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టిన అధికారులు, ఫారం నంబర్ 6 ద్వారా కొత్త ఓటరు నమోదు, ఫారం నంబర్ 7 ద్వారా మార్పులు, చేర్పులు, ఫారం నంబర్ 8ను పోలింగ్ బూత్లు, తదితర దరఖాస్తులను స్వీకరించారు. ఫారం 6 ద్వారా ఖానాపూర్లో 7,341, నిర్మల్లో 9,069, ముథోల్ 9,067 దరఖాస్తులు వచ్చాయి. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ఫారం నంబర్ 7 ద్వారా నిర్మల్లో 5,197, ఖానాపూర్లో 4,033, ముథోల్లో 3,856 దరఖాస్తులు రాగా.. వాటిని బీఎలోవో సమక్షంలో అర్హులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. ఫారం నంబర్ 8 ద్వారా ఖానాపూర్లో 749, నిర్మల్లో 969, ముథోల్లో 441 దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించిన అధికారులు, అర్హులను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలో రెవెన్యూ అధికారులు జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలతో పాటు, ఖానాపూర్, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో సమగ్ర ఓటరు జాబితా సర్వే చేయనున్నారు. అనంతరం జాబితాను పక్కగా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. 26వ తేదీ వరకు సమగ్ర ఓటరు జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో బోగస్ ఓట్లపై దృష్టిపెట్టిన అధికారులు, అనుమానం ఉన్న ఓటర్లను గుర్తించి, పరిశీలించిన తర్వాతనే వారి పేర్లు చేర్చేలా కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలుండగా, 6,59,177 మంది ఓటర్లున్నారు. అందులో 3,19,189 పురుషులు, 3,39,944 స్త్రీలు, 44 మంది ఇతరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో 2,02,280 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 99,367, స్త్రీలు 1,02,903, ఇతరులు 10 మంది ఓటర్లున్నారు.
ముథోల్ నియోజకవర్గంలో 2,26,725 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 1,10,796, స్త్రీలు 1,15,910, ఇతరులు 19 మంది ఓటర్లున్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో 2,30,172 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 1,09,026, స్త్రీలు 1,21,131, ఇతరులు 15 మంది ఉన్నారు.