ఎదులాపురం, మే 27 : ఆదిలాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక రసాభాసగా మారింది. కొన్ని రోజులుగా మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నిక కోసం ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. కౌన్సిల్ సభ్యుల్లో కొంత మంది శిబిరాలకు వెళ్లడంతో పట్టణ రాజకీయం వేడెకింది. ఈ నేపథ్యంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ కౌన్సిల్ సభ్యులతో సహా.. తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న సభ్యులతో బుధవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సైతం వచ్చారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష బయటకు వచ్చి.. సభ్యులతో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్కు సైతం అజెండా కాపీలు అందించలేదన్నారు. అందుకే బయటకు వచ్చినట్లు పేరొన్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సభ్యు లు సైతం సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.
మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ బయటకు వెళ్లిపోయారు. ఎన్నిక విషయాన్ని చైర్ పర్సన్ వెల్లడిస్తారని ఆయన మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సైతం సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే, ఎంపీలతో కూడిన బీజేపీ కౌన్సిల్ సభ్యులు బయటకు వచ్చి ఎన్నిక వివరాలను వెల్లడించారు.
ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీకి 27 మంది సభ్యుల బలం ఉండడంతో చైర్ పర్సన్తోపాటు మిగిలిన సభ్యులు ఎన్నిక అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్లో సీనియర్ అయిన ధోని జ్యోతిని తాతాలిక చైర్ పర్సన్గా నియమించి నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. కమిషనర్ కూడా వెళ్లిపోయారని, ఇది సరికాదన్నారు. కొండూరు భరత్ కుమార్, జనగం సంగీత, షేక్ ఇమ్రాన్, నెమలికొండ కరుణను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.