దస్తురాబాద్, ఏప్రిల్ 8 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో అంధత్వ నివారణకు చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు శిబిరానికి ప్రజల నుంచి స్పందన లభిస్తున్నది. యువత, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ ఉత్సాహంగా వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. గత 51 రోజులుగా మండలంలోని గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు 6022 మందికి కంటి పరీక్షలు..
మండలంలోని దేవునిగూడెం, మున్యాల తండా, ఆకొండపేట, ఎర్రగుంట, గొడిసేర్యాల గొండుగూడెం(జీ), మల్లాపూర్ గొండుగూడెం, పెర్కపల్లె, భూత్కుర్, గొడిసేర్యాల, రేవోజిపేట, బుట్టపూర్ గ్రామాల్లో వైద్యులు కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. ప్రసుత్తం మున్యాల గ్రామంలో కంటి వెలుగు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల్లో వైద్యులు 6022 మందికి కండ్ల పరీక్షలు చేశారు. 1153 మందికి రీడింగ్ గ్లాస్లులు అందజేశారు. 821 మందికి దూరం చూపు అద్దాలను ఆర్డర్ చేయగా, 454 మందికి దూరం చూపు అద్దాలు పంపిణీ చేశారు.
చూపు మంచిగా కనిపిస్తున్నది..
ఇప్పటి దాక కండ్లు కనిపించలే. మా ఊరిలో సర్కారోళ్లు కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసిందని తెలిసింది. అక్కడికి వెళ్లినా. నా సమస్య డాక్టర్లకు చెప్పిన. పరీక్ష చేయగా దూరం చూపు కనిపిస్త లేదని చెప్పారు. అక్కడే నాకు కండ్ల అద్దాలకు అర్డర్ పెట్టినట్లు డాక్టర్లు చెప్పారు. అద్దాలు వచ్చాక ఇస్తామన్నారు. పైసా ఖర్చు లేకుండా కంటి సమస్య పరిష్కారమైంది.పేదలకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు ఇస్తుండ్రు. సారు సల్లంగుండాలే.
–రాజేశ్వరి, మున్యాల
సద్వినియోగం చేసుకోవాలి
కంటి వెలుగు పథకంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అప్పటికప్పుడు అద్దాలు అందజేస్తున్నాం. మండలంలో 51 రోజుల నుంచి అందరి సహకరంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నం. పలు గ్రామాల్లో నిర్వహించిన శిబిరాల్లో 6022 మందికి కంటి పరీక్షలు చేసి, 1153 మందికి రీడింగ్ గ్లాస్లులు అందజేశాం. ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
– నాగరాజు,కంటి వైద్య శిబిరం మెడికల్ ఆఫీసర్, దస్తురాబాద్