జన్నారం, ఫిబ్రవరి 18: కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో రెండో విడుత బర్డ్ వాక్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన 74 మంది వీక్షకులు తరలివచ్చినట్లు డిప్యూటీ కన్జర్వేటర్ సిరిపురం మాధవరావు తెలిపారు. ముందుగా అటవీశాఖ విశ్రాంతి భవనం వద్ద వచ్చిన వీక్షకుల పేర్లను నమోదు చేసుకున్నారు. అటవీ శాఖ టీడీసీలో వారికి అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, కవ్వాల్ అడవుల ప్రత్యేకలను ఎఫ్డీవో మాధవరావు వివరించారు. అక్కడే వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అనంతరం అటవీ శాఖకు చెందిన 10 వాహనాల్లో వారిని ఇందన్పల్లి రేంజ్లోని మైసమ్మకుంట, గనిశెట్టికుంట, కలపకుంట ప్రాంతాలకు అధికారులు, సిబ్బంది తీసుకువెళ్లారు. వీక్షకులు వారి వెంట తెచ్చుకున్న కెమెరాల్లో పక్షులను ఫొటోలు తీశారు. వన్యప్రాణులు, పక్షులు వైట్ ఐ బజార్, స్పోటడ్ బిల్ డక్స్, వూలినెక్డ్ స్టార్క్, స్పోటడ్ డౌవ్స్, సర్పంట్ ఈగల్ పక్షులను కెమెరాల్లో బంధించారు.