నిర్మల్ అర్బన్, ఆగస్టు 18 : రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా, ఈ నెల 21న లక్కీ డ్రా ద్వారా విజేతలెవరో తేలనుంది. కాగా, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ ద్వారా షాపులు తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది.
జిల్లాలో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలు, రెండు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలకు అధికారులు 2023-25 కాలపరిమితికి గాను ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గతంలో వైన్స్ టెండర్లు దక్కించుకున్న వారితో పాటు రాని వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేశారు. ఒక్కో వైన్స్కు సగటున 40 మంది దరఖాస్తు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 47 మద్యం దుకాణాల్లో తొమ్మిదింటిని రిజర్వ్ కులాలకు (ఎస్సీ, గౌడ్, ఎస్టీ) కేటాయించారు. వీటిని సైతం ఆయా కులాల వారు సద్వినియోగం చేసుకొని దరఖాస్తులు అందజేశారు. మిగతా 38 మద్యం దుకాణాలకు రిజర్వ్ అభ్యర్థులతో పాటు ఇతరులు సైతం తమ దరఖాస్తులను సమర్పించారు. ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో ఆశావహులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
మద్యం దుకాణాలకు శుక్రవారం చివరి తేదీ కావడం, అమ్మవారి దినం మంచి రోజు ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో తమ దరఖాస్తులను సమర్పించారు. గురువారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 318 దరఖాస్తులు రాగా.. శుక్రవారం నాటికి 656 దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో వీటి సంఖ్య 974కు చేరింది. ఇందులో నిర్మల్ ఎక్సైజ్ పరిధిలో 718, భైంసా పరిధిలో 256 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల రద్దీ దృష్ట్యా సమీకృత కలెక్టరేట్లోని ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రాత్రి వరకు అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
ఈ నెల 21న లక్కీడ్రా.. డిసెంబర్ 1న కొత్త దుకాణాలు ప్రారంభం
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపడంతో టెండర్లకు సంబంధించిన ప్రథమ ఘట్టం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 21న కలెక్టరేట్లో మద్యం దుకాణాలకు లక్కీడ్రా నిర్వహించనున్నారు. ప్రథమ ఘట్టం ముగియడంతో లక్కీ డ్రా కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. డ్రాలో గెలుపొందిన అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి నూతన వైన్స్లను ప్రారంభించుకునేందుకు అర్హత పత్రాలను (లైసెన్స్)జారీ చేయనున్నారు.
ఆదిలాబాద్లో 975 దరఖాస్తులు
2023-25 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా, ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 40 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో రిజర్వేషన్ల ప్రకారం 5 ఎస్సీలకు, ఒక గౌడ్స్కు, 9 ఎస్టీలకు కేటాయించారు. మొత్తం 975 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 దుకాణాలకు 628, ఇచ్చోడలో 13 షాపులకు 219, ఉట్నూర్లో 9(ఎజెన్సీ) దుకాణాలకు 128 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కాగా, చివరి రోజు ఆదిలాబాద్ పరిధిలో 292, ఇచ్చోడలో 153, ఉట్నూర్ పరిధిలోని దుకాణాలకు 82 చొప్పున దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హీమశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ సీఐలు సీహెచ్ శ్రీనివాస్, రాజమౌళి, మహేందర్ సింగ్, సిబ్బంది ఉన్నారు.