ఎదులాపురం, ఏప్రిల్ 7 : ఆరోగ్య ఆదిలాబాద్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫిజీషియన్స్ అసోసియేషన్, రిమ్స్ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని,18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం రక్తదానం చేసిన వైద్యులకు కలెక్టర్ పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు.
ఆదిలాబాద్ చరిత్రలోనే మొదటి సారిగా 103 మంది వైద్యులు రక్తదానం చేశారని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఐఎంఏ, ఏపీఐ, జూడాల సహకారంతో రక్తదానం శిబిరం విజయవంతమైందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఐఎంఏ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డాక్టర్లు అశోక్, శ్యామ్ప్రసాద్, ఏపీఎల్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సుమలత, కోశాధికారి డాక్టర్ వెంకట్ రెడ్డి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, అక్షిత, ఐడీఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ రెడ్డి, ఐఎంఏ మాజీ అధ్యక్షులుమనోహర్, ప్రకాశ్, వైద్యసిబ్బంది ఉన్నారు.