కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇలా వచ్చారు.. అలా వెళ్లారు.. గత ఐదేండ్ల క్రితం ఎన్నికలప్పుడు వచ్చి సిమెంట్ కంపెనీని పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఓట్లు దండుకున్న తర్వాత హామీని గాలికొదిలేశారు. రాష్ట్ర సర్కారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. సహాయ, సహకారాలు అందిస్తామని ప్రకటించినా పెడచెవిన పెట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు, దీక్షలు చేసినా స్పందన లేదు. గిప్పుడు మళ్లా ఎన్నికలొస్తున్నాయని సభ పెట్టి సర్కారును తిట్టి పోయిండు. కనీసం.. సిమెంట్ కంపెనీ మాట కూడా మాట్లాడలేదు. గిటువంటోళ్లు ఓట్ల కోసమే వస్తరు.. పోతరని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం సిమెంటు వినియోగం అధికంగా ఉంది. డిమాండ్ ఫలితంగా ధరలు సైతం బాగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభిస్తే కంపెనీకి లాభాలు రావడంతో పాటు జిల్లాలోని 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మూతపడిన సీసీఐని ప్రారంభించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభిస్తామని అన్నారు. ఐదేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీ నేరవేరలేదు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన హన్స్రాజ్ గంగారాం సీసీఐని సందర్శించి, పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లా అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించే సిమెంటు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పరిశ్రమ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన రైతులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు అఖిలపక్ష కమిటీగా ఏర్పడి ఆరు నెలలు అందోళనలు చేశారు. 45 రోజుల నిరహార దీక్షలు చేపట్టారు. జిల్లా ప్రజల అకాంక్షను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. సీసీఐ విషయంలో కేంద్ర అవలంబిస్తున్న తీరుపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించడానికి అన్ని అవకాశాలున్నాయి. జాతీయ రహదారి-44కు సమీపంలో పరిశ్రమ భూములున్నాయి. సిమెంటును తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు, మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు రోడ్డు మార్గం కూడా ఉన్నది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తో పాటు నీటి వనరులు సైతం ఉన్నాయి. సిమెంటు తయారీకి అపారమైన వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడడంలేదు.
సీసీఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేసింది. ముఖ్యమం త్రి కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి సీసీఐని పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ గతంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్గితేను కలిసి, వినతి పత్రం కూ డా అందజేశారు. సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెబితే తాము ప్రారంభిస్తామని సూచించారు. పరిశ్రమ పునఃప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని కూడా లిపారు. పలుమార్లు మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేలను కలిసి వినతిపత్రాలు అందజేసినా మోదీ ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను, వేలాది మంది ఉపాధిని, స్థానిక ప్రజల కోరికలను ఏ మాత్రం లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అమ్మకానికి చర్యలు చేపట్టింది. యంత్ర సామగ్రి వేలం తర్వాత సిమెంటు పరిశ్రమకు సంబంధించిన విలువైన భూములు, భవనాల అమ్మకాన్ని సైతం ప్రారంభించనున్నదని సీసీఐ సాధన కమిటీ సభ్యులు అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్షా, సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గతంలో హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న హన్స్రాజ్ గంగారం కూడా సందర్శించి పరిశ్రమను ప్రారంభిస్తామన్నారు. రెండేళ్లుగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పాత బకాయిల రద్దుతో పాటు 51-49 శాతం పద్ధతిన నడిపించేందుకు గానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రారంభిస్తామని తెలిపినా కేంద్రంలో స్పందనలేదు. సీసీఐ పునః ప్రారంభ విషయంలో స్థానిక ఎంపీ సోయంబాపురావు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పలుమార్లు సంప్రదించినా ఫలితం లేదు. ఈ ప్రాంతం అభివృద్ధిపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. – విజ్జగిరి నారాయణ, కో-కన్వీనర్, సీసీఐ సాధన కమిటీ