మందమర్రి, జనవరి 21: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం మందమర్రి పట్టణంలో వేడుకలు నిర్వహించేందుకు ఆలయాలు ముస్తాబయ్యాయి. పాలచెట్టు ఏరియాలో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు మార్కెట్లోని భక్తాంజనేయ స్వామి ఆలయం, మూడవ జోన్లోని రామాలయం, బురదగూడెం వద్ద గల కోరెగట్టు ఆంజనేయస్వామి ఆలయం, రామన్ కాలనీ, మారుతీనగర్లోని ఆంజనేయస్వామి ఆలయాలు, యాపల్ ఏరియాలో కోదండ రామాలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయాలను పూలు, తోరణాలతో అలంకరించారు.
సీతారామచంద్రుల వారి కల్యాణ మహోత్సవం, అయోధ్య అక్షింతలతో ఆశీర్వచనం, ద్విచక్ర వాహన శోభాయాత్ర, అభిషేకాలు, అర్చనలు, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆయా ఆలయాల వేద పండితులు తెలిపారు. పట్టణంలోని అన్ని వీధుల గుండా శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
బెల్లంపల్లి, జనవరి 21: పట్టణంలోని కోదండ రామాలయంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ తీర్థ్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్కుమార్, పట్టి వెంకటకృష్ణ, ముడిమడుగుల శ్రీనివాస్, దార కల్యాణి, గోమాస కమల, ఉప్పులేటి సవ్రంతి, ముడిమడుగుల దీపారాణి, ఏముర్ల ప్రదీప్, దుగినే సాయికృష్ణ, తుమ్మ శ్రీపాల్, కంటేవాడ నగేశ్, భక్తులు పాల్గొన్నారు.