మంచిర్యాల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇది వరకు ట్రేడ్ లైనెన్స్ కావాలంటే మున్సిపాలిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తుకోసారి.. ఆన్లైన్కోసారి.. డబ్బులు చెల్లించేందుకు మరోసారి.. చివరకు లైసెన్స్ తీసుకోవడానికి ఇంకోసారి తిరిగేవారు. అన్నీ సక్రమంగా జరిగితే వారంలో లైసెన్స్ చేతికందేది. ఆర్థిక సంవత్సరం ఇంకో నెలలో ముగుస్తుందనే నాటికి లైసెన్సుల జారీ కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ట్రేడ్ లైసెన్స్ ఒక్కరోజులోనే వచ్చేస్తుంది. మున్సిపల్ ఆఫీసులకు మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారులే ల్యాప్టాప్ తీసుకొని మన దగ్గరకు వస్తారు. దరఖాస్తు చేసి, దాన్ని అప్రూవ్ చేసి సాయంతం వరకు షాప్లోనే ఇచ్చి వెళ్తారు. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్ రాహుల్ చొరవతో ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. వచ్చీ రాగానే మున్సిపాలిటీల ఆదాయ మార్గాలపై దృష్టి సారించిన ఆయన, పన్నులు వసూలు చేయడంతో పాటు ట్రేడ్లైనెన్సుల జారీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. కేవలం రెండు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలను రాబట్టారు.
రూ.36.17 లక్షల ఆదాయం..
మంచిర్యాల జిల్లా పరిధిలో ఏడు మున్సిపాలిటీలుండగా, 2022-23లో 5,386 లైసెన్సులు జారీ చేయాలనేది లక్ష్యం. కానీ.. ఇందులో ఇప్పటి వరకు 2,013 లైసెన్సులు ఇచ్చారు. అయితే.. గడిచిన రెండు నెలల్లో 1,301 లైసెన్సులు జారీ చేయడం గమనార్హం. ఇలా ఇప్పటి వరకు ట్రేడ్లైసెన్సుల జారీతో రూ.36.17 లక్ష ల ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరం లో ఫిబ్రవరి నెల వరకు అన్ని మున్సిపాలిటీల్లో 40 శాతం వరకు ట్రేడ్లైసెన్సులు జారీ చేయ డం ఇదే తొలిసారి. ఇందులో రెండు నెలల్లోనే 20 శాతానికిపైగా ఇవ్వడం గొప్పవిషయమని అధికారులు చెబుతున్నారు. మిగతావి మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. షాపు డబుల్ రోడ్లో ఉంటే స్కేర్ ఫీట్కు రూ.4, సింగిల్ రోడ్లో ఉంటే స్కేర్ ఫీట్కు రూ.3 చొ ప్పున లైసెన్స్లకు ఛార్జీలు తీసుకుంటున్నారు.
అంతకుముందు..
ఇప్పటి వరకు మున్సిపల్ సిబ్బంది వెళ్లి ట్రేడ్లైసెన్స్ తీసుకోమని చెప్పడం. వ్యాపారులు వచ్చి దరఖాస్తు చేశాక.. దాన్ని ఆన్లైన్ చేయడం. ఆ తర్వాత వాళ్లు వచ్చి పేమెంట్ కట్టడం. సిబ్బంది వెళ్లి పరిశీలించడం, చివరకు కమిషనర్ లైసెన్స్ జారీ చేయడం. ఈ ప్రక్రియకు మొత్తం వారం పట్టేది.
ప్రస్తుతం ఇలా..
మున్సిపల్ సిబ్బంది ఒకరోజు ముందే వెళ్లి ట్రేడ్ లైసెన్స్ కోసం వస్తామని, కావాల్సిన డాక్యుమెం ట్లు, డబ్బులు రెడీ చేసుకోమని చెప్తారు. అనంతరం సంబంధిత అధికారులకు వెళ్లి వాళ్ల ముం దే కొలతలు తీసుకుంటారు. అక్కడే ఒక అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. సాయంత్రం వరకు కమిషనర్ సంతకం చేసి లైసెన్స్ను తీసుకువెళ్లి అప్పగిస్తారు. ఇది మొత్తం ఒక్క రోజులోనే అయిపోతుంది.
కేవలం రెండు నెలల్లోనే..
ఆర్థిక సంవత్సరం టార్గెట్ అంటే మున్సిపల్ సిబ్బంది సాధార ణంగా ఫిబ్రవరి, మార్చిలో వసూలు చేయడం మొదలుపె డుతారు. కానీ ఈసారి ఆ పద్ధతి మార్చాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చాం. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ల్యాప్టాప్లు అందజేశాం. మున్సిప ల్ సిబ్బందే నేరుగా వెళ్లి లైసెన్సులు ఇచ్చి వస్తున్నారు. ఇలా మొత్తం టార్గెట్లో 20 శాతం వరకు గడిచిన రెండు నెలల్లోనే పూర్తి చేశాం. వచ్చే ఏడాది నుంచి మరింత త్వరగా లైసెన్సులు జారీ చేస్తాం.
– రాహుల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల