గోదావరిఖని, ఫిబ్రవరి 19: సింగరేణిలో గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఖిల పక్ష కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం మైనింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్లో జరిగిన కార్మిక సం ఘాల అఖిల పక్ష కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చే శారు. టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన మైనింగ్ సిబ్బందిని ఉత్పత్తి సాధన కోసం ఒత్తిడి చేయడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూపాలపల్లి కేటీకే ఓసీపీ-3 ఎక్స్టెన్షన్లో గతంలో జరిగిన ప్రమాదంలో కార్మికులకు గాయాలయ్యాయని యాజమాన్యం అక్కడ పని చేసిన షార్ట్ ఫైర్ సాధుల ప్రకాశ్ను డిస్మిస్ చేయడం, ఓవర్మెన్ శ్రీకాంత్ డీ ప్రమోట్ చేయడం సీనియర్ సర్ధార్ వెంకటేశ్వర్లు 8 ఇంక్రిమెంట్ల కోత విధించడం అన్యాయమన్నారు.
మైనింగ్ సమస్యల పరిష్కారం కోసం మూకుమ్మడిగా క్యాజువల్ లీవ్ పెట్టాలని కార్మిక సంఘాలు సూచించాయి. దీనిని మైనింగ్ సిబ్బం ది ఏకగ్రీవంగా ఆమోదించారు. యాజమాన్యంతో తక్షణమే సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మైనింగ్ స్టాఫ్ నాయకుడు మాదాసు రాంమ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్ల య్య, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ఐఎన్టీయూ సీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఉద్యోగుల సంఘం నాయకుడు గట్ట య్య, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.