బాసర, సెప్టెంబర్ 26 : నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ప్రారంభోత్సవ పూజల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల్గొన్నారు. ఉదయం అభిషేకం అనంతరం ఘట స్థాపనతో అమ్మవారిని ప్రతిష్ఠించి అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.
ఉదయం 4 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్పాఠక్, ఈవో సోమయ్య కలశ స్థాపన పూజ చేశారు. ఆలయంలో గణపతి పూజ, కలశ పూజ, చతుషష్ఠి పూజ తదితరవి నిర్వహించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి కల్పించారు. శైలపుత్రి అవతారంలో పూజలు అందుకున్న అమ్మవారికి ఆలయ అర్చకులు నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించారు.
ఈ సందర్భంగా భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అధికారులకు సూచించారు. అనంతరం ఆలయంలో ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, ఏఎస్పీ కిరణ్ఖారేతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కాగా, సరస్వతీ అమ్మవారు రెండో రోజు శుక్రవారం బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించనున్నారు.