ఇంద్రవెల్లి, జూలై 21: పల్లె ప్రగతితో ఇంద్రవెల్లి గ్రామం అభివృద్ధి బాటపట్టింది. పది రోజుల కార్యక్రమంలో భాగంగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ జీపీ పరిధిలో 2120 కుటుంబాలున్నాయి. 12,248 జనాభా ఉంది. కాగా, రూ.1.50 కోట్లతో వార్డులతో పాటు గ్రామంలో పలు రకాల శాశ్వతమైన అభివృద్ధి పనులు చేశారు. గల్లీగల్లీలో పారిశుధ్య పనులు నిర్వహించారు. డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రతి వార్డుతో పాటు వీధుల్లో కొత్తగా సీసీ రోడ్లు, మురుగుకాలువలు నిర్మించారు. శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్డు, డంప్యార్డు, పల్లె ప్రకృతి వనాలు పూర్తిస్థాయిలో నిర్మితమయ్యాయి. వాగుకు ఆనుకొని ఉన్న ఇండ్లలోకి వరద రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రూ.6 లక్షలతో సట్వాజీగూడ నుంచి మిలింద్నగర్ వరకు వాగును వెడల్పు చేశారు. అలాగే ప్రజల విన్నపం మేరకు గ్రామాల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించారు. మండల కేంద్రం.. రాత్రివేళ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నది. రోడ్డుకు ఇరువైపులా స్తంభాలకు రంగురంగుల విద్యుత్ లైట్లు, పలు చోట్ల హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వార్డులు, గ్రామాల్లో రకరకాల మొక్కలు నాటారు. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు.
రూ.1.50 కోట్లతో చేపట్టిన పనులు..
పల్లె ప్రగతిలో భాగంగా ఇంద్రవెల్లి పంచాయతీకి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి నిధులతో పలు పనులు చేశారు. రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, రూ.10 లక్షలతో నాలుగు పల్లె ప్రకృతి వనాలు, రూ.3 లక్షలతో జడ్పీ పాఠశాల ప్రధాన గేట్, రూ.2.50 లక్షలతో డంప్యార్డు, రూ. 10.50 లక్షలతో దళితుల కోసం శ్మశానవాటిక, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మించారు. అలాగే రూ.40 లక్షలతో ఆయా వార్డుల్లో మురుగుకాలువలు పూర్తిచేశారు. రూ.7 లక్షలతో పరిధిలోని గ్రామాలు, మండల కేంద్రంలోని వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. రూ.7.50 లక్షలతో ఇంద్రవెల్లిలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. రూ.7 లక్షలతో విద్యుత్ మోటర్లకు మరమ్మతులు చేపట్టారు. రూ.4 లక్షలతో తాగునీటి సమస్య పరిష్కరించారు. అలాగే రూ.6 లక్షలతో సట్వాజీగూడ నుంచి మిలింద్నగర్ వరకు వాగును వెడల్పు చేశారు. రూ.20 లక్షలతో పంచాయతీ కార్మికులకు జీతాలు, రూ.10 లక్షలతో విద్యుత్ బిల్లులు చెల్లించారు. రూ.2 లక్షలతో మిలింద్నగర్లో అంగన్వాడీ కేంద్రానికి మరమ్మతులు చేశారు. రూ.లక్షతో అభివృద్ధి పనులు చేపట్టారు.
అభివృద్ధే లక్ష్యం..
పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు వార్డుల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడమే లక్ష్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం పంచాయతీకి నెల నెలా రూ.10లక్షల పల్లె ప్రగతి నిధులు మంజూరు చేస్తున్నది. వాటితోనే అభివృద్ధి పనులు చేయిస్తున్నాం.
ప్రభుత్వ నిధులతో పనులు
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నది. గ్రామ సభలో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. వార్డు సభ్యులు, ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గ్రామాలతోపాటు వార్డులు, వీధుల్లో శాశ్వత అభివృద్ధి పనులు చేశాం. ఈ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తున్నాం.
పనులు చేశారు..
సర్పంచ్ కోరెంగా గాంధారి ఆధ్వర్యంలో మిలింద్నగర్లో అభివృద్ధి పనులు చేశారు. అంతర్గత రహదారులకు మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించారు. మురుగు కాలువలను శుభ్రం చేసి, పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకున్నారు. వీధుల్లో అన్ని స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు.