బాసర, డిసెంబరు 17 : కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని ఆర్జీయూకేటీ బాసర ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ను కోరారు. హైదరాబాద్లోని ఐఐసీటీలో శనివారం నిర్వహించిన సమావేశంలో యూజీసీ చైర్మన్తో ఆర్జీయూకేటీ బాసర ఇన్చార్జి వీసీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. 2016లో ఆర్జీయూకేటీ 12బీ వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ, ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అదనపు కోర్సులపై వివరించారు. యూజీసీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. యూజీసీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ వుమెన్, హైదరాబాద్ ఆరో స్నాతకోత్సవంలో వీసీ వెంకటరమణ ప్రసంగించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రస్తుత కాలంలో బాలికలే చదువులో ముందంజలో ఉన్నారని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డ చదువులో రాణిస్తే రాష్ట్రం, దేశం మరింత ముందుకెళ్తుందన్నారు. చదువును ఆస్తిగా భావించాలని, విద్యతోనే సకలం సంపాదించుకోచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్డీ డీన్ డాక్టర్ చంద్రశేఖర్, హరిబాబు, పీఆర్వో విజయ్కుమార్ పాల్గొన్నారు.