ఎదులాపురం,మార్చి3: ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాల పని తీరును కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రైనేజీల్లో మురుగు నీరు నిల్వకుండా చూడాలన్నారు. నిత్యం వ్యర్థాలను తొలగించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలోని రోడ్లపై ఉన్న ఇసుకను తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు.
నాళాల్లో చెత్త చేసే వారికి అపరాధ రుసుము విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. గాంధీనగర్, భాగ్యనగర్లో రోడ్లపై మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలు గుర్తించామని, వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. అనంతరం అర్బన్ పార్క్ను పరిశీలించారు. ఆయా కాలనీల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సిబ్బంది ఉన్నారు.