మండుటెండల్లోనూ మొక్కల సంరక్షణ
ఆదర్శంగా నిలుస్తున్న బాపురావు దంపతులు
బజార్హత్నూర్, ఏప్రిల్ 11: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన భగత్బాపురావు, వనిత దంపతుల ఇంట్లోకి వెళ్తుంటే ఎక్కడ చూసినా పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతాయి. మండుటెండల్లోనూ మొక్కలు ఆహ్లాదనిస్తున్నా యి. ఇంట్లోని వ్యర్థాలతో వర్మికంపోస్టు తయారు చేసి మొక్కల ఎదుగుదలకు కృషి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పండ్ల మొక్కలు ప్రత్యేకం..
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి తీసుకువచ్చిన ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, చెర్రీ, అంజీర, దానిమ్మ, సపోటా, జామ, బాదం మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. వీటితో పాటు 20 రకాల పూల మొక్కలు, సుగంధ ద్రవ్యాలు యాలకులు, సోంపు మొక్కలు పెంచుతున్నారు.ప్రతి నిత్యం మూడు పూటల నీళ్లు పోస్తూ, కలుపు తీస్తూ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు.
మండల పరిషత్ కార్యాలయంలో..
బజార్హత్నూర్ మండల పరిషత్ కార్యాలయంలోని పరిసర ప్రాంతంలో హరితహారంలో భాగంగా నాటిన పూలు, పండ్లు, నీడనిచ్చే 300 రకాల మొక్కలకు సిబ్బంది ప్రతి రోజూ నీళ్లు పోస్తూ, కలుపు తీస్తూ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. ఎంపీడీవో దుర్గం శంకర్, సూపరింటెండెంట్ రంగి పుష్ప, సీనియర్ అసిస్టెంట్ కాంచన, జూనియర్ అసిస్టెంట్ జాదవ్ ఆశాకిరణ్ మొక్కల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టారు. కార్యాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా ఆ పచ్చటి మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి. సమస్యల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆ మొక్కల దగ్గర కాసేపు సేదతీరుతున్నారు.