ఎదులాపురం,జనవరి8: బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి )తోనే దేశ అభివృద్ధి ధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, భాగ్యనగర్ కాలనీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పాటు పలువురు యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానిన విస్మరించాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బీజేపీ దేవుళ్ల పేరిట వివాదాలను సృష్టించే నీచ రాజకీయాలకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలుచేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపుదిద్దుకున్న స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనించి ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, కౌన్సిలర్ పవన్ నాయక్, అశోక్ స్వామి , నాయకులు కొండ గణేశ్, సాజిదొద్దీన్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యంపై సీఎ కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలో రూ. 20 లక్షలతో సబ్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రం లో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం తిరగి ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైద్యులు గ్రామాల్లోకే వచ్చి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు అందిస్తారని చెప్పారు. జిల్లాలో వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో రెగ్యులర్ డాక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. అనంతరం బేల మండల కేంద్రంలో రూ. 5లక్షలతో బుద్ధ విహార్ భవన నిర్మాణానికి భూమి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీఅండ్హెచ్వో రవీందర్ రాథోడ్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ఠాక్రే, నాయకులు సతీశ్ పవార్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, మస్కేతేజ్రావు, జక్కుల మధుకర్, బండి సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, ఎజాజ్ఖాన్, సంతోష్ బెదుడ్కర్, ఆయా గ్రామాల సర్పంచ్లు , ఎంపీటీసీలు పాల్గొన్నారు.