ఎదులాపురం, ఆగస్టు 4 : రాబోయే అసెంబ్లీ అన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పనపై రాజాకీయ పార్టీల ప్రతినిధులు వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. సమగ్ర ఓటరు జాబితాను ఈ నెల 21న అన్ని పోలీంగ్ కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. 1350 కంటే ఎక్కువ ఓటర్ల సంఖ్య ఉన్న పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించడం జరిగిందన్నారు.
మొత్తం జిల్లాలో 9 నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 4 పోలింగ్ కేంద్రాలను మరో చోటుకు మార్చినట్లు వెల్లడించారు. ఓటర్లు వారి పోలింగ్ కేంద్రాన్ని జాబితాలో సరిచుసుకోవాలని సూచించారు. జిల్లాలో 592 పోలింగ్ కేంద్రాలున్నాయని, అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్లో 302 ఉన్నాయని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు జాబితాను సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని పార్టీల ప్రతినిధులు సహకారించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జంగిలి ప్రశాంత్, రాము, దినేశ్మటోలియ, భీంసేన్ రెడ్డి, చంద్రల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.