తాండూర్ : బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ( Wage Board ) ఒప్పందాన్ని సాధించాలని టీబీజీకేఎస్ (TBGKS ) బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు ( Srinivas rao ) డిమాండ్ చేశారు. తాండూర్ మండలంలోని బెల్లంపల్లి ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టార్స్ లో గురువారం పర్యటించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
2026 జూన్ 31వ తేదీతో 11వ వేతన కాలపరిమితి ముగిసిందని, జులై 1వ తేదీ నుంచి 12వ వేతన ఒప్పంద కాలం ప్రారంభమైందని అన్నారు. అయినా నేటి వరకు జాతీయ సంఘాలు కనీస ఉమ్మడి డిమాండ్ల పత్రం కోల్ ఇండియా యాజమాన్యానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. జేబీసీసీఐ కమిటీ వేయలేదని, దీనితో బొగ్గు గని కార్మికులకు అన్యాయం జరుగుతుంద న్నారు. సింగరేణిలో బొగ్గు గనుల టెండర్లో సైట్ విజిట్ విధానానికి తెరలేపి సింగరేణిలో ఎక్సెస్ టెండర్లు వేసి సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాకాని గుర్తింపు సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆరోపించారు.
రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని సింగరేణిని కాపాడుకోవడంలో టీబీజీకేఎస్ ముందు ఉంటుందని వివరించారు. కేసీఆర్, కేటీఆర్ హయాంలో సాధించిన హక్కులు కరపత్రం రూపంలో ఉన్నాయని వాటిని చదవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నామినేటెడ్ పద్ధతిలో సింగరేణికి తాడిచర్ల బొగ్గు బ్లాక్-2 కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సత్తుపల్లి త్రీ, కోయగూడెం త్రీ బొగ్గు బ్లాకులను ప్రైవేట్వారికి కేటాయింయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వారు బొగ్గు ఉత్పత్తి చేయడం లేదని విమర్వించారు. వారి కేటాయింపులను రద్దుచేసి వాటిని కూడా సింగరేణికే నామినేటెడ్ పద్ధతిలో కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్, వర్క్ షాప్, స్టోర్స్ ఫిట్ సెక్రెటరీలు గాజలేని శ్రీనివాస్, గణపతి, అసిస్టెంట్ సెక్రటరీ సురేష్, నాయకులు వెంకన్న, సూరం వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, సంగి ప్రశాంత్, వెంకట్, కనకయ్య, వెంకటస్వామి, మహిళా కార్మికులు, కార్మికులు పాల్గొన్నారు.