ఆర్టీసీలో మేడారానికి బంగారం
సమ్మక్క-సారలమ్మకు సమర్పిస్తున్న భక్తులు
ప్రసాదం తిరిగిపొందే అవకాశం
భైంసా, ఫిబ్రవరి, 13 : కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం భైంసా నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా భక్తులను కేటాయించింది. కాగా.. మేడారం వెళ్లలేని వారి కోసం మొక్కులు చెల్లించుకునేలా ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా దేవాదాయ శాఖ మొక్కులు అమ్మవారికి సమర్పించుకునే అవకాశం కల్పించింది.
ఇంటినుంచే మొక్కులు..
మేడారంలో సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు అక్కడికి వెళ్లలేనివారికోసం ఆర్టీసీ ఈ అవకాశం కల్పిస్తున్నది. ‘బంగారం పంపించడం మీ వంతు.. అమ్మవారికి సమర్పించడం మా తంతు’ అనే నినాదంతో ఆర్టీసీ ఈ కొత్త సేవలను ప్రారంభించింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్సిల్లో బుక్ చేస్తే చాలు.. ఆ మొక్కును నేరుగా అమ్మవార్లకు సమర్పించనున్నారు. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సూచనల మేరకు ఈ మహోత్తర కార్యానికి శ్రీకారం చుట్టారని అధికారులు స్పష్టం చేశారు. బంగారాన్ని సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్ల నుంచి ఈ సేవలను వినియోగించుకునేలా తగిన కార్యాచరణను రూపొందించారు.
ఐదు కిలోల బంగారం (బెల్లం) సమర్పణకు అవకాశం..
ఐదు కేజీల వరకు బంగారం (బెల్లం) పంపించుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ సహకారంతో కల్పిస్తున్నారు. భక్తులు పంపిన బంగారాన్ని దేవాదాయశాఖ అధికారులు అమ్మవార్లకు సమర్పించడంతో పాటు తిరిగి సంబంధిత భక్తులకు 200 గ్రా ముల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను అందజేయనున్నారు. ఇందుకు ప్రత్యేక చార్జీలను వసూలు చేస్తున్నారు. 200 కిలో మీటర్ల దూరమైతే రూ.400, ఆపైన రూ.450 చార్జీలు ఆర్టీసీకి చెల్లించాలి. బంగారాన్ని బుక్ చేసినచోటే ప్రసాదాన్ని తిరి గి పొందే అవకాశాన్ని కల్పించారు. ఇతర వివరాలకు భైంసా బస్టాండ్లో సిబ్బందిని కలవాలని పేర్కొన్నారు.