అవగాహనతోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట
కొవిడ్ లక్షణాలుంటే పరీక్షలు తప్పనిసరి
సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం
హోం ఐసొలేషన్ కోసం సర్కారు కిట్ల పంపిణీ
ఆదిలాబాద్, ఏప్రిల్ 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘భయమే మృత్యువు.. ధైర్యమే ఆయువు’ అని కరోనా వైరస్పై అవగాహన పెంచుకోవాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనిషి శరీరంలో వైరస్ 15 రోజులపాటు ప్రభావం చూపుతుందని తెలుపుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారు తమకు ఏమో అయిందని ఆందోళన చెందవద్దని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే ఇతర వ్యాధుల మాదిరిగానే కోలుకోవచ్చని అంటున్నారు. కరోనా సోకిన వారిలో చాలా మందికి లక్షణాలు ఉండకపోగా మరికొందరికి స్వల్పంగా, మధ్యస్తంగా, అధికంగా లక్షణాలు కనపడుతాయి. పరిస్థితి విషమించకముందు వైద్యులను సంప్రదిస్తే త్వరగా వ్యాధి నుంచి బయటపడవచ్చు. ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రజలు వినియోగించుకోవాలని, టెస్ట్లు చేయించుకోవాలని వైద్యులు సూచించిన మందులు వాడాలని పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిలో వేగం పెరిగింది. పాజిటివ్ వచ్చిన వారు తమకు ఏదో అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు. మానసిక ధైర్యం కోల్పోయి మరింత అనారోగ్యానికి గురువుతున్నారు. కరోనా ఇతర వ్యాధుల మాదిరి వైరస్ ఇన్ఫెక్షన్ అని పాజిటివ్ వచ్చిన వారు ఏ మాత్రం ఆందోళన చెందకుండా వైద్యం పొందితే, ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా యువకులు కరోనా నిబంధనలు పాటిస్తూ తమ కుటుంబసభ్యులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. కరోనా వైరస్ నోరు, ముక్కు, కండ్ల ద్వారా శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలో ప్రవేశిస్తుంది. గొంతునొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు కలిగి జర్వం వస్తుంది. సరైన సమయంలో వైద్యం తీసుకుంటే తగ్గిపోతుంది. వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న కారణంగా దీర్ఘకాలిక రోగులు జాగ్రత్తగా ఉండాలని, వ్యాధి లక్షణాలు ఏ మాత్రం కనపడినా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటివి కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
ధైర్యంగా ఉండాలి. .
కరోనా నుంచి 98 శాతం మంది కోలుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలి. భయంతో శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కొవిడ్ సమాచారం తెలుసుకొని చనిపోయిన సంఘటనలు తెలుసుకుంటే మానసిక ఆందోళనకు గురవుతారు. తమకు ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడుతూ, సంగీతం వింటూ ప్రశాతంగా ఉండేలా చూసుకోవాలి. జలుబు, గొంతునొప్పి తగ్గడానికి ఆవిరి పట్టుకోవాలి. కషాయం లాంటి వాటితో రుగ్మతలు దూరమవుతాయి. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు సర్కారు వైద్యశాలల్లో చికిత్స అందిస్తున్నది. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో మందులు వాడితే ఎలాంటి సమస్యలు లేకుండా కొవిడ్ తగ్గిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం చేయవద్దు
కరోనా విషయంలో ప్రజలు ఏ మాత్రం నిర్ల క్ష్యం చేయవద్దు. లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.వైద్యుల సల హాలు, సూచనలు పాటి స్తూ మందులు వాడాలి. నాకేమవుతుందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరుగవచ్చు. వైరస్ సోకగానే భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చినా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి. మానసికంగా సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రజలు వినియోగించుకోవాలి. వైద్యాధికారులు చెబుతున్న సలహాలు, సూచనలు పాటించాలి.
కుడ్మిత మనోహర్, అదనపు వైద్యాధికారి (ఏజెన్సీ)